హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని మిగిలిన రాష్ర్టాలకూ తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం అవసరమని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద రావెల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, ఒక్క ఏపీకే కాక దేశం మొత్తానికి బీఆర్ఎస్ కావాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉన్నది. విభజన తర్వాత ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలాగా తయారైంది.
5 కోట్ల మంది ఏపీ ప్రజలు రెండు పార్టీల ఆధిపత్య పోరు, రాజకీయం మధ్య నలిగిపోతున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకునే వారే లేరు. అభివృద్ధిలో ఇప్పటికే ఏపీ 20 ఏండ్లు వెనక్కి పోయింది. మరోపక్క సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. భారతదేశానికే తలమానికంగా అవతరించింది. ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ వేదిక కోసం చూస్తున్న ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని అక్కడి ప్రజలు ఆశాకిరణంలా భావిస్తున్నారు. ఇందుకోసమే తోట చంద్రశేఖర్, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం.
మేమిద్దరం పాత మిత్రులం. గతంలో ఒకే పార్టీలో కలిసి పనిచేశాం. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తాం. వ్యవసాయం వదిలి వెళ్తున్న రైతులను తిరిగి వ్యవసాయం వైపు మళ్లించిన ఘనత కేసీఆర్ది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పుష్కలమైన సాగునీరు రైతులకు ఇచ్చి రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేసి చూపించారు. ఒక దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ దేశానికే రోల్ మాడల్గా నిలిచింది. ఈ పథకం దేశం మొత్తం అమలు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అవసరం. బీజేపీకి బీఆర్ఎస్ లాంటి దార్శనికత, దూరదృష్టి లేవు. కేవలం మతాన్ని వాడుకొని లబ్ధి పొందడమే వారి విధానం. గతంలో కాంగ్రెస్ పార్టీలానే ఇప్పుడు బీజేపీ ఇతర పార్టీలను వేధిస్తున్నది. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను అణచివేయాలని బీజేపీ చూస్తున్నది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెప్తారు’ అని రావెల పేర్కొన్నారు.