హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మందికి పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7 శాతానికి చేరువైంది. వీక్లీ పాజిటివిటీ రేటు సైతం 3.7 శాతానికి చేరింది. 4 శాతం దాటితే ప్రమాదస్థాయిగా పరిగణిస్తారు. ప్రస్తుత పరిణామాలు కొవిడ్ నాలుగో వేవ్కు ముందస్తు హెచ్చరికలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత పది రోజుల్లోనే రోజువారీ కొవిడ్ కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. పాజిటివిటీ రేటు మూడు రెట్లకుపైగా పెరిగింది.
ముప్పు ముంచుకొస్తున్నా కేంద్రప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర నటిస్తున్నది. కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడే ఉత్తమ మార్గం వ్యాక్సినేషన్. ఇప్పటికే దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. ప్రికాషన్ డోస్ వేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు వ్యాక్సిన్ల కొనుగోలు, సరఫరాను కేంద్రమే తన గుప్పిట్లో పెట్టుకున్నది. ప్రచారం చేసుకొని లబ్ధి పొందింది. మోదీయే శాస్త్రవేత్తగా మారి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ప్రచారం చేసుకున్నది. ఇప్పుడు కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో టీకాల పంపిణీపై చేతులెత్తేసింది. టీకాల కొనుగోలు, సరఫరాను ఆపేసింది. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ర్టాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి హడావుడి చేయడం తప్ప వ్యాక్సిన్ల పంపిణీని పట్టించుకోవడం లేదు.
కొవిడ్ మాక్ డ్రిల్
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 10: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ దవాఖానలో సోమవారం ‘కొవిడ్ మాక్ డ్రిల్’ నిర్వహించారు. ఆరోగ్య శాఖ సూచన మేరకు డీఎంఈ డాక్టర్ కే రమేశ్రెడ్డి, అదనపు డీఎంఈ, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, ఆర్ఎంవో దవాఖానలోని లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, ఐసీయూ, ట్రై యాజ్, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించారు.
రాష్ట్రంలో అదుపులోనే కొవిడ్
రాష్ట్రంలో కొవిడ్ మాత్రం పూర్తి అదుపులో ఉన్నది. రోజువారీ కేసులు 20లోపే నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,511 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 19 మందికి మాత్రమే పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 0.54 శాతానికి పరిమితం అయ్యింది. ఈ నెల 1వ తేదీన సైతం రోజువారీ కేసులు 22 కాగా, పాజిటివిటీ రేటు 0.45 శాతంగా ఉన్నది. వీక్లీ పాజిటివిటీ రేటు సైతం అప్పుడు, ఇప్పుడు 0.5 శాతంగానే నమోదైంది.
కేంద్రం చేతులెత్తేయడంతో సొంతగా 15 లక్షల టీకాలు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ర్టానికే చెందిన బయోలాజికల్-ఈ సంస్థ నుంచి టీకాలను కొని, ప్రజలకు పంపిణీ చేసేందుకు రాష్ట్రవైద్యారోగ్యశాఖ సిద్ధమవుతున్నది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయడం, కొవిడ్ జాగ్రత్తపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం వల్ల పరిస్థితి అదుపులో ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరరకు 3.24 కోట్ల మందికి మొదటి డోసు, 3.15 కోట్ల మందికి రెండో డోసు పంపిణీ చేశారు. మరో 1.35 కోట్ల ప్రికాషన్ డోసు వేశారు. మొదటి, రెండో డోసులను వేగంగా పంపిణీ చేసి తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలవగా.. ప్రికాషనరీ డోసు 49 శాతానికిపైగా పూర్తిచేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. అందరికీ వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే ఇంకా సుమారు 1.71 కోట్ల డోసుల టీకాలు అవసరం అవుతాయని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో నిల్వలు లేక టీకాల పంపిణీ ఆగిపోయింది. 20 లక్షల డోసులు ఇవ్వాలని రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్వయంగా లేఖ రాసినా కేంద్రం పట్టించుకోలేదు.