Antibiotics | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): మాంసాహార ప్రియులు హడలిపోయే విషయాన్ని ఐకార్, ఎఫ్ఏవో అధ్యయనం బయటపెట్టింది. మేకలు, చేపలు, గొర్రెలు, రొయ్యలు, కోళ్లన్న తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటిబయోటిక్స్ వినియోగం పెరిగిపోతున్నదని, దీంతో వాటిలో మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ (నిరోధకత) ఎక్కువైపోతున్నదని వెల్లడైంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) కలిసి తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ర్టాల నుంచి 2019-2022ల మధ్య కాలంలో పలు నమూనాలను సేకరించాయి. ఆయా నమూనాలలో ఈ-కొలి, స్టఫైలోకోకస్, ఏరోమోనస్, విబ్రియో వంటి వివిధ రకాల బ్యాక్టీరియా ఆనవాళ్లపై పరిశోధనలు జరిపాయి.
ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యలు, కోళ్లు, పందుల నుంచి సేకరించిన శాంపిళ్లలో యాంటిబయోటిక్స్ రెసిస్టెన్స్ టెస్ట్లు చేశాయి. వీటిలో బర్రెలు, ఆవులు తప్ప మిగితావన్నీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ను సంతరించుకుంటున్నాయని.. వాటిలో యాంటిబయోటిక్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని వాటి అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా మనం వాడే పెన్సిలిన్కు అధికంగా 70 నుంచి 90 శాతం వరకు ఇప్పటికే వాటికి నిరోధకత వచ్చిందని అవి పేర్కొన్నాయి. ఎరిత్రోమైసిన్, సెఫోటాక్సిమ్, మెరోపినమ్, సిప్రొఫ్లోక్సాసిస్, సెఫొక్సిటిన్, సెఫ్పోడాక్సిమ్, అమికాసిన్ వంటి వాటికి ఎక్కువ మొత్తంలో నిరోధకతను సంతరించుకున్నాయని తెలిపాయి.
కోళ్ల పెంపకంలో యాంటిబయోటిక్స్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల, వాటిలో నిరోధకత పెరుగుతున్నట్లు హెచ్చరించింది. మేకల్లో సెఫోటాక్సిమ్ రెసిస్టెన్స్ 41 శాతం ఉండగా, అమికాసిన్ 35 శాతం, యాంపిసిల్లిన్ 26 శాతం దాకా నిరోధకత పెరుగుతున్నట్టు అధ్యయనం తేల్చింది. అవుల్లో, బర్రెల్లో యాంటిబయోటిక్స్ రెసిస్టెన్స్ తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. ఆవులు, బర్రెలు ఇచ్చే పాలపైనా యాంటిబయటిక్స్ టెస్ట్ చేశారు.