హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గతంలో నెలకొన్న పీక్ డిమాండ్ రికార్డులన్నీ తెరమరుగయ్యాయి. శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో అత్యధికంగా విద్యుత్తు డిమాండ్ ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 14న రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా 15 వేల మెగావాట్లను దాటి గరిష్ఠ డిమాండ్ నమోదయ్యింది. ఆ రోజు విద్యుత్తు డిమాండ్ 15,254 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నా.. 24 గంటల నిరంతరాయ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండటంతో.. వచ్చే నెలలో 16 వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నదని విద్యుత్తు శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఆ మేరకు విద్యుత్తును అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.