హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ‘ఫెడెక్స్’ కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ ముఠా అమాయకుల నుంచి దాదాపు రూ.18.24 కోట్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ ప్రజలను అప్రమత్తం చేశారు. కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మవద్దని సూచించారు. ఇలాంటి నేరాలకు సంబంధించి 2022లో 64 కేసులు నమోదు కాగా, నిరుడు 645 కేసులు నమోదైనట్టు శిఖా గోయెల్ తెలిపారు. 2022 నుంచి 2024 వరకు నమోదైన మొత్తం కేసుల్లో రూ.18,24,56,908 కోట్లు కొల్లగొట్టారని, అందులో రూ.4,77,01,679ను నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ సాయంతో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాపాడినట్టు వివరించారు.
మోసం జరిగేదిలా..
తాము ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నామని, మీకో పార్సిల్ వచ్చిందని ఫోన్ చేసి వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉండడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి భయం పుట్టిస్తారు. ఢిల్లీ, ముంబై పోలీసులు కాల్ చేస్తారని చెప్పి పెట్టేస్తారు. అనంతరం పోలీసుల పేరుతో ఫోన్లు చేసి తాము స్వాధీనం చేసుకున్న పార్సిల్లో డ్రగ్స్, నకిలీ పాస్పోర్టు, విదేశీ కరెన్సీ ఉన్నాయని, కేసు నమోదు చేస్తున్నట్టు చెబుతూ మరింతగా బెదిరిస్తారు. స్టేట్మెంట్ రికార్డింగ్ అంటూ హడావుడి చేస్తారు. ఆధార్కార్డు, ఇతర వ్యక్తిగత, బ్యాంకు వివరాలు సేకరిస్తారు. జరిమానా కింద డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తారు. అప్పటికీ లొంగకపోతే సీబీఐ, కస్టమ్స్ పోలీసులు వస్తారని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పత్తాలేకుండా పోతారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని శిఖాగోయెల్ సూచించారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఇలాంటి నేరాల బారినపడినవారు www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని, లేదంట 1930 నంబర్కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని, 87126 72222 నంబరుకు వాట్సాప్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.