కరోనాతో అన్ని రంగాల్లో కుదేలైన దేశాన్ని ఆదుకొనేందుకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన రెండేండ్ల తర్వాత వచ్చిన మార్పు శూన్యం. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఆత్మనిర్భర్ లక్ష్యం, కానీ గత రెండేండ్లలో దిగుమతులు భారీగా ఎగుమతులు తగ్గాయి. 2019లో 474 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉంటే, 2021కు 610 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో దేశీయ పారిశ్రామిక, తయారీ రంగం కోలుకోలేని స్థితికి చేరింది. మోదీ సర్కారువి వట్టిమాటలేనని తేలిపోయింది.
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా విపత్తు కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతామంటూ కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ సాధించిందేమీ లేదని తేలిపోయింది. ఆత్మనిర్భర్ భారత్ను ప్రకటించినప్పుడు, దేశీయ పరిశ్రమ తయారీ సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని కేంద్రం గొప్పగా చెప్పుకున్నది. కానీ, ఎగుమతులు, దిగుమతులపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రంగాలూ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని స్పష్టమవుతున్నది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ అసత్య ప్రచారంతో కాలం వెళ్లదీస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. దేశంలో సమస్యలు తలెత్తినప్పుడల్లా ప్రజల దృష్టిని మరల్చేందుకు సరికొత్త నినాదాన్ని అందుకోవడం అలవాటుగా మార్చుకున్నదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సహజంగా ఆర్థికాభివృద్ధితో ఉత్పాదకత పెరిగి ఉద్యోగాలు లభిస్తాయి. దీనిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉండగా, కేంద్రం మాత్రం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
610 బిలియన్లకు చేరిన దిగుమతులు
2019లో దేశం నుంచి 313 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా, 2020లో కొవిడ్ సమయంలో 291 బిలియన్ డాలర్లు.. 2021లో 417 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దిగుమతులు 2019లో 474 బిలియన్ డాలర్లు ఉంటే, 2021లో 610 బిలియన్ డాలర్లకు పెరిగాయి. రూపాయి విలువ నానాటికీ పతనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతులు పెరగడం దేశంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2021లో రూ.32 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, రూ.47లక్షల కోట్లమేర దిగుమతులు జరిగాయి. అంటే, విదేశీ మారకద్రవ్యం రూపంలో దాదాపు రూ.15 లక్షల కోట్లమేర నష్టం జరిగింది. రూపాయి విలువ 2014లో రూ.60 నుంచి 62 వరకు ఉండేది. నేడు కూడా రూపాయి విలువ ఇలాగే ఉంటే కనీసం రూ.ఐదు లక్షల కోట్లు విదేశీ మారకద్రవ్యం మిగిలేది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో దాదాపు 50 శాతం పారిశ్రామికరంగం వాటా ఉండగా, దేశంలో ఇది 25 శాతమే ఉంది. పరిస్థితి ఇలా ఉంటే, ఉత్పత్తులు, ఉద్యోగాలు ఎలా సాధ్యమవుతాయో అర్థం చేసుకోవచ్చు. దేశంలో తయారీరంగం వాటా 14 శాతం కాగా, మైనింగ్ వాటా 1.6 శాతమే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ వాటా తొమ్మిది శాతం. నేడు బొగ్గు కూడా దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం.
కుదేలైన ఎంఎస్ఎంఈలు
2020లో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రచారానికి కోట్లాది రూపాయలు వెచ్చించిన కేంద్రం, ఆత్మనిర్భర్ భారత్ను సాధించేందుకు ప్రయత్నం చేయలేదు. దేశంలో భారీగా పత్తి ఉత్పత్తి అవుతున్నప్పటికీ, చైనా నుంచి తక్కువ ధరకు దారాన్ని దిగుమతి చేసుకొంటున్నారు. ఖాదీ వస్ర్తాల తయారీలో మనకన్నా బంగ్లాదేశ్ ఎంతో ముందున్నది. దిగుమతులను ప్రోత్సహించటంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తున్న ఎంఎస్ఎంఈలు ఇబ్బందుల్లో పడిపోయాయి. కొవిడ్కు ముందునుంచే ఈ పరిస్థితి ఉండగా, ఇప్పుడు పరిస్థితులు అధ్యాన్నంగా మారాయి. ఎంఎస్ఎంఈలు రూ.2053 కోట్లమేర బ్యాంకులకు బకాయిపడ్డాయి. రిటైల్ సెక్టర్లో సైతం రూ.2040 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. విదేశాల నుంచి దిగుమతుల ఫలితంగా ఇక్కడి ఎంఎస్ఎంఈలు, తయారీరంగం పూర్తిగా కుదేలయ్యాయి. సుమారు రూ.14000 కోట్ల కార్పొరేట్ బకాయిలు పేరుకుపోయాయి.
కార్పొరేట్ వ్యవసాయంతో రుణాల ఎగవేత
2013-14లో వ్యవసాయ రంగానికి రూ.5.96 లక్షల కోట్లు రుణాలు ఇవ్వగా 98 శాతం వసూలయ్యాయి. మోదీ హయాంలో 13.25 లక్షల కోట్లు రుణాలు ఇవ్వగా, 95 శాతం వసూలు కావాల్సి ఉన్నది. కార్పొరేట్ వ్యవసాయం ఉన్నచోటే ఇవి వసూలు కాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో చౌకధరకు దొరికేవన్నీ దిగుమతి చేసుకుంటూపోతే భవిష్యత్తులో వ్యవసాయరంగం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే దారం, పామాయిల్ నుంచి సైనికులు ధరించే యూనిఫాం కూడా దిగుమతి చేసుకొంటున్నారు. ఆయుధాల దిగుమతిలో సౌదీ అరేబియా తరువాత రెండో అతిపెద్ద దేశం భారత్. ఆయుధాల తయారీలో మనం స్వావలంబన సాధించినట్టు గొప్పలు చెప్తున్నా దేశం 24వ స్థానంలో ఉంది.
బీపీసీఎల్ను చౌకగా కట్టబెట్టే యత్నం
బీపీసీఎల్లో 52 శాతమున్న ప్రభుత్వవాటాను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నించగా స్పందన లేదు. వేదాంత గ్రూపు ముందుకొచ్చినప్పటికీ చివరకు వెనక్కు తగ్గింది. 2020లో బీపీసీఎల్ విలువను రూ.90 వేల కోట్లుగా నిర్ణయించగా, ఇప్పుడు దాని విలువ రూ.68 వేల కోట్లకు పడిపోయింది. బీఎస్సీలో దాని షేర్ విలువ రూ.419 నుంచి రూ.320కి పడిపోవడమే కారణం. ధర తగ్గడంతో కార్పొరేట్లకు మరింత ప్రయోజనం చేకూర్చే వీలు కలిగింది. బీపీసీఎల్ విషయంలో వెనక్కు తగ్గిన వేదాంత గ్రూపు.. హిందుస్థాన్ జింక్ను కొనుగోలు చేయడం విశేషం. కొవిడ్కు ముందువరకు కేంద్రం పరిశ్రమలకు రూ.33 లక్షల కోట్లు రుణాలు ఇవ్వగా, తిరిగిరానివి రూ.5.78లక్షల కోట్లు. ప్రభుత్వం కార్పొరేట్లపై ఆధారపడుతుంటే.. కార్పొరేట్లు ప్రజా సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను దోచుకోవడమే పనిగా పెట్టుకొన్నాయి.
తగ్గిన ముడి చమురు ఉత్పత్తి
గతంలో ముడిచమురు 75 శాతమే దిగుమతి చేసుకోగా.. ప్రస్తుతం అది 85 శాతానికి పెరిగింది. ఓఎన్జీసీ నుంచి ఉత్పత్తి తగ్గించి ప్రైవేటుకు అప్పగించడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. కార్పొరేట్ సంస్థలు దేశంలో ఉత్పత్తవుతున్న ముడి చమురును కూడా ఎగుమతి చేస్తున్నాయి. రష్యా నుంచి 30 శాతం తక్కువ ధరకు లభిస్తున్న చమురును దిగుమతి చేసుకొని యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశంలో మన్మోహన్సింగ్ హయాంలో 37 మిలియన్ టన్నుల ముడిచమురు దేశంలో ఉత్పత్తి కాగా, గత ఏడాది 29 మిలియన్ టన్నులే ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది దాన్ని 30 లక్షల టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 2013-14లో 189 మిలియన్ టన్నుల ముడిచమురు దిగుమతి చేసుకోగా, గత ఏడాది 225 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకొన్నారు. గతంలో ముడిచమురు దిగుమతులకు రూ.ఎనిమిది లక్షల కోట్లు వెచ్చించగా, ఇప్పుడు 9.5 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నారు. రూపాయి విలువ తగ్గడంవల్ల భారం మరింత పెరిగింది.