హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్రోడ్డుపై వాహనాల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలో మీటర్లకు పెంచుతూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ఔటర్పై వాహనాల వేగం ఆధారంగా మొత్తం 4 లైన్లను కేటాయించినట్టు తెలిపారు. అందులో కుడివైపున లేన్-1, లేన్-2ను, ఎడమ వైపున లేన్-3, లేన్-4ను ఏర్పాటు చేశారు. లేన్-1, 2లో కనీస వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఈ లేన్లలో వేగాన్ని గంటకు 100 నుంచి 120 కి.మీ.కు పెంచారు. లేన్-2, 3పై కనీస వేగం గంటకు 40 కి.మీ. గరిష్ఠంగా 80 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలకు ఔటర్పై అనుమతి లేదు. వేగంగా ప్రయాణించే వాహనాలు కుడివైపున కేటాయించిన లేన్-1, 2పై ప్రయాణించాలి. 40-80 కి.మీ. వేగంతో వెళ్లే వాహనాలు ఎడమ వైపున కేటాయించిన లేన్-3, 4పై వెళ్లాలి.