హైదరాబాద్ : తెలంగాణలో శాంతి భద్రతలు ( Law and Order ) పూర్తిగా దిగజారిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజేపీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs) పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజ్ శ్రవణ్, దేశిపతి శ్రీనివాస్ కలిసి వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును ద్వంసం చేశారని బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలని, దాడులను ప్రోత్సహించిన బండి సంజయ్ మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలపై, వారి ఇండ్లపై రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ రెచ్చగొడితేనే ఆయన కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన భాషను తాము మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు.
మతం పేరు చెప్పి రెచ్చగొట్టడం తప్ప ఆయన వల్ల ప్రజలకు రూపాయి లాభం లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పై అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.