హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూముల విలువను హేతుబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ముమ్మ రం చేసింది. గత ఎనిమిదేండ్ల నుంచి స్థిరాస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచని తెలంగాణ ప్రభుత్వం.. ఈసారి కూడా ప్రజలపై భారం పడకుండా రివిజన్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో స్థిరాస్తుల విలువ పెంపు ప్రస్తుతమున్న రేటు కంటే 50 శాతం మించకపోవచ్చని విశ్వసనీయ సమాచారం. ప్రాంతాలను బట్టి 30 నుంచి 50 శాతం వరకు పెంపు ఉండవచ్చని తెలుస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజు కూడా 2013 నుంచి పెరగలేదు. పొరుగు రాష్ర్టాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగినప్పటికీ తెలంగాణలో ఎలాంటి మార్పు లేదు. భూమి మొత్తం విలువలో ఇది కేవలం 6 శాతం (స్టాంప్ డ్యూటీ 4 శాతం, ఆస్తుల బదిలీ సుంకం 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం)గా మాత్రమే ఉన్నది. ఇప్పుడు దీన్ని 7 లేదా 7.5 శాతానికి పెంచాలని ఉన్నతాధికారులు ఇప్పటికే సిఫారసు చేశారు. వచ్చే వారంలోగా భూముల విలువ సవరణ (రివిజన్) ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ శేషాద్రికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిం ది. పట్టణప్రాంతాల్లో అదనపు కలెక్టర్తోపాటు జిల్లా రిజిస్ట్రార్ రివిజన్లో కీలకపాత్ర వహిస్తున్నారు. గ్రామీణప్రాంతాల్లో ఆర్డీవోలతోపాటు సబ్రిజిస్ట్రార్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.