హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): దేశంలోని వర్సిటీల్లో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచుతామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. సూపర్ న్యూమరరీ కోటాలో ఈ సీట్లను పెంచుతామని వెల్లడించారు. సోమవారం మీడియా ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలిచ్చిన ఆయన.. కఠినంగా ఉన్న పీహెచ్డీ నిబంధనలను త్వరలోనే సవరిస్తామని చెప్పారు. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్డీ ప్రవేశాలు పొందేందుకు వీలుగా నిబంధనలను మార్చుతామని, ఒక్కో ప్రొఫెసర్ ఇద్దరు అంతర్జాతీయ విద్యార్థులకు గైడ్గా వ్యవహరించేలా మార్పులు చేస్తామని అన్నారు. భారత్కు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని జగదీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం 165 దేశాల నుంచి 50 వేల మంది విద్యార్థులు మన దేశానికి వచ్చి చదువుకుంటున్నారని, వీరిలో మూడింట రెండోవంతు విద్యార్థులు 5 దేశాల నుంచే వస్తున్నారని తెలిపారు. మన దేశం నుంచి 9 లక్షల మంది విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్తున్నారని వివరించారు. డబుల్ డిగ్రీ, ట్విన్నింగ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంల వల్ల విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. విదేశీ వర్సిటీలు మన దేశంలో క్యాంపస్ను తెరిచేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని, ఈ ప్రక్రియ తుది దశకు చేరుకొన్నదని తెలిపారు. మన దేశంలోని వర్సిటీల క్యాంపస్లను విదేశాల్లో తెరిచేందుకు డాక్టర్ కే రాధాకృష్ణన్ కమిటీని వేశామని, ఈ కమిటీ సూచనల మేరకు తగు చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు.