అప్పు చేసి అయినా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకొంటున్న సామాన్యులపై మోదీ సర్కారు పెను భారం మోపింది. ఆర్బీపై వడ్డీరేట్ల పెంపుతో రుణాలు, రుణ వాయిదాల భారాన్ని అమాంతం పెంచేసింది. ద్రవ్యోల్బణం కట్టడి పేరుతో ఐదు నెలల్లోనే రిజర్వు బ్యాంకు వడ్డీరేటును ఏకంగా 1.9 శాతం పెంచటంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ధరల పెంపు, జీఎస్టీ పేరుతో పన్నుల భారీ వడ్డింపుతో సామాన్యుడి కడుపు మాడుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు తీసుకొని నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నవారిపై మోయలేని భారం పడుతున్నది. వడ్డీరేటు పెంచినా ద్రవ్యోల్బణం పైపైకే పోతుండటంతో ముందుముందు వడ్డీ రేటు మరింత పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడనున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 1: అధిక పన్నులు, అస్తవ్యస్థ విధానాలతో నిత్యావసరాల ధరల్ని కొండెక్కించి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను కూడా చిదిమేస్తున్నది. ఐదు నెలల కాలంలోనే రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లు 1.9 శాతం పెరిగిపోయాయి. ఈ ఏడాది మే నెల నుంచి మొదలుపెట్టి వరుసగా నాలుగు దఫాలు రేట్లు పెంచింది. ఈ పెంపు ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదంటే.. 20 ఏండ్ల కాలపరిమితితో రూ.30 లక్షల గృహ రుణంపై అసలు కాకుండా కేవలం చెల్లించాల్సిన వడ్డీనే రూ.33 లక్షలకు పెరుగుతున్నది.
ఇంతకుముందు ఇది రూ.24.5 లక్షలే. వాస్తవానికి ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తితో నడిచే సంస్థ అయినప్పటికీ, వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనే మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు కేంద్రం నియమించినవారే ఉంటారు. అలాగే మోదీ ప్రభుత్వం ద్రవ్యలోటు, వాణిజ్యలోటు, కరెంట్ ఖాతాలోటులను సరైన విధానాలతో కట్టడి చేయకపోవడంతో రూపాయి విలువ పాతాళలోకంలోకి వెళ్లిపోయింది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు వడ్డీ రేట్ల పెంపునకు కారణమయ్యాయి.
ఆర్బీఐ రెపో రేటును ఎంత పెంచితే వాణిజ్య బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను అంతశాతం పెంచేస్తాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంటల్లోనే ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐతో సహా చాలా బ్యాంకులు అరశాతం మేర వడ్డీ రేట్ల పెంపును ప్రకటించాయి. చిత్రమేమిటంటే పొదుపు జీవులకు కాస్తో కూస్తో ప్రయోజనం కల్పించే డిపాజిట్ రేట్లను మాత్రం సగమే పెంచుతాయి. ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకొనే స్వల్పకాలిక రుణాలకు చెల్లించే వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు.
రెపో పెంపుతో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఆటోమొబైల్ రుణాలు, విద్యా రుణాలు, కార్పొరేట్ రుణాలు..ఇలా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. మే నెలలో 4 శాతంగా ఉన్న రెపో రేటు ప్రస్తుతం 5.90 శాతానికి చేరింది దీంతో ఇప్పటికే రుణాలు తీసుకొన్నవారు, కొత్తగా రుణాలు తీసుకొంటున్నవారు అధిక వడ్డీని చెల్లించాల్సిందే. ప్రస్తుత రుణగ్రస్తులైతే ఇప్పటివరకూ వారు చెల్లిస్తున్న నెలవారీ వాయిదాలు పెరుగుతాయని, లేదా రుణ చెల్లింపు కాలపరిమితిని పెంచుకోవాలని బ్యాంక్బజార్.కామ్ సీఈవో అధిల్ షెట్టి చెప్పారు.
కాలపరిమితి పెంచుకోవడాన్నే ఎంచుకుంటే సంవత్సరాలు తరబడి రుణ వాయిదాలు చెల్లిస్తూ ఉండాలని హెచ్చరించారు. ఉదాహరణకు 20 ఏండ్ల కాలపరిమితితో తీసుకొన్న రుణానికి ఈ ఐదు నెలల్లో పెరిగిన వడ్డీ రేటుతో 33 ఏండ్లు వాయిదాలు కడుతూనే ఉండాలి. 1.9 శాతం రేటు పెంపు మధ్యతరగతికి ఇలా చుక్కలు చూపిస్తున్నది. ఫ్లోటింగ్ రేట్లపై రుణాలు తీసుకొన్న ప్రస్తుత రుణ గ్రహీతలకు ఈఎంఐలు తక్షణమే పెరుగుతాయి. కొత్తగా రుణం తీసుకోదల్చినవారు గరిష్ఠ వడ్డీ రేట్లపై అధిక ఈఎంఐలకు సిద్ధపడాల్సిందే.
సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినపుడు ప్రస్తుత గృహ రుణాలకు ఈఎంఐలు పెంచేకంటే రుణం కాలపరిమితిని బ్యాంకులు పెంచుతూ ఉంటాయి. ఎందుకంటే ఈఎంఐ అగ్రిమెంట్లో మార్పుచేయాల్సిన అవసరం రాదు కనుక. కానీ దీంతో రుణ గ్రహీత సంవత్సరాల తరబడి అప్పు కడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో పెరిగిన 1.9 శాతం వడ్డీ రేటుతో ఈఎంఐల పెంపు బదులు కాలపరిమితి పెంపునకు మొగ్గుచూపితే చెల్లించాల్సిన వడ్డీ తడిసి మోపెడవుతుంది.
దీంతో 20 ఏండ్ల రుణం కాస్తా 33 ఏండ్ల రుణంగా మారుతుంది. అప్పటికి మధ్యతరగతి ఉద్యోగులు పదవీ విరమణ చేసి, ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఇది వద్దనుకుంటే ఇంటి ఖర్చుల్ని తగ్గించుకుని, అధిక ఈఎంఐలు చెల్లించాల్సిందే. అలాగే 15-20 ఏండ్ల రుణంపై కాలపరిమితిని మాత్రమే బ్యాంకులు పెంచడానికి మొగ్గుచూపుతుంటాయి. అంతకంటే ఎక్కువ కాలపరిమితితో తీసుకొంటే ఈఎంఐ అగ్రిమెంట్ మార్చి అధిక వాయిదాను బ్యాంకులు వసూలు చేస్తాయి.
ఆర్బీఐ ఐదు నెలల క్రితం చేపట్టిన పెంపు ప్రక్రియ ఇప్పట్లో ముగిసేది కాదు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం అధిక ద్రవ్యోల్బణం త్వరితంగా దిగిరాదని, అందుచేత సమీప భవిష్యత్తులోనూ రేట్లు పెంచుతామన్న సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను ఎడాపెడా పెంచడంతో ధరలు పెరిగిపోయాయి. కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటును అదుపుచేయలేకపోవడంతో రూపాయి నిలువునా పతనమై దిగుమతి ఆధారిత ఉత్పత్తులు, ఇంధనాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో వడ్డీ రేట్లను పెంచాల్సిన అగత్యం ఏర్పడింది.
ఆర్బీఐ వచ్చే డిసెంబర్ సమీక్షలో మరో అరశాతం రేట్లను పెంచుతుందని ఆర్థిక వేత్తలు గట్టిగా చెప్తున్నారు. ఎంతవరకు రేట్లు పెరుగుతాయో ప్రస్తుతం అంచనావేయడం కష్టసాధ్యమని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం దిగిరావడంపై అది ఆధారపడి ఉంటుందని ఫైయర్స్ సీఈవో తేజాస్ ఖోడే చెప్పారు. అంటే వరుస రేట్ల పెంపుతో మధ్యతరగతికి సొంతింటి కల ఇక కలగానే మిగిలిపోయే పరిస్థితి దాపురించింది.