హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీంకు చెందిన ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అటాచ్ చేసినట్టు సమాచారం. నయీం బినామీలుగా ఉన్న వారిపై ఉన్న ఆస్తులను ఇప్పటికే గుర్తించిన ఐటీ అధికారులు, సోమవారం మొత్తం రూ.150 కోట్ల మేర అటాచ్ చేసినట్టు తెలిసింది. ఆదాయపన్నుశాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్ ఈ జప్తు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కలిపి మొత్తం 45 ఆస్తులను అటాచ్కు ఆదేశాలు జారీ చేసింది.
దీనిలో వ్యవసాయ భూములతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అయితే, వీటి విలువ డాక్యుమెంట్ల ప్రకారం రూ.12కోట్లు ఉన్నా.. మార్కెట్ విలువ రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆస్తులను నయీం తన భార్య మహ్మద్ హసీనా బేగంతోపాటు మరికొందరు తన ఆప్తుల పేరిట రిజిస్టర్ చేసినట్టు పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తులను ఐటీ అధికారులు త్వరలోనే స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిసింది.