హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని సృజనాత్మకతను, శాస్త్రీయ విజ్ఞానాన్ని, భాషాకౌశలాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన జాతీయ బాలాశ్రీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సాహకాలను అందజేస్తున్నదని, ఇన్నోవేషన్కు ప్రాధాన్యమిచ్చి ఆవిష్కరణల వైపు నడిపిస్తున్నదని తెలిపారు. విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించి సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని, సంప్రదాయ పద్ధతులకు ఆధునిక శాస్త్రీయతను జోడించి అద్భుత ఫలితాలను రాబట్టాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది చిన్నారులకు బాలాశ్రీ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ అధికారి గాజర్ల రమేశ్, జవహర్ బాలభవన్ సంచాలకురాలు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.