T-Works | హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్ను ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రారంభించారు. టీ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీ వర్క్స్ సీఈవో సంజయ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు పలువురు పాల్గొన్నారు.
రాయదుర్గం ఐటీ కారిడార్లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ-హబ్( T Hub ), టీ-వర్క్స్( T -Works ), ఇమేజ్ టవర్( Image Tower )ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ నిన్న వివరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ప్రజల కోసం తీసుకొస్తున్నదని చెప్పారు.
ఉత్పత్తుల ఆవిష్కరణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా టీ-వర్క్స్ను ప్రభుత్వం డిజైన్ చేసిందని, దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారు టీ-వర్క్స్కు వస్తే, వారి ఆలోచనలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకొనే అవకాశం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇందుకు ఇప్పటివరకు 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించామని, మరో రూ.40 కోట్ల వరకు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే అవకాశం ఉన్నదని వివరించారు. టీ-వర్క్స్ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉన్నదని, ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్, ఇతర అంశాలపై టీ-వర్క్స్లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారని తెలిపారు.