బన్సీలాల్పేట, మార్చి 11: రాష్ట్రంలో మిడ్వైఫరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని, మాతా-శిశు సంరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు. సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని పాత గాంధీ వైద్య కళాశాల బాలికల హాస్టల్ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నేషనల్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణలో మరిన్ని మిడ్వైఫరీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో 2017 నుంచి మిడ్వైఫరీ శిక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న యూనిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్లను ఆయన అభినందించారు. మిడ్వైఫరీ శిక్షణను పూర్తిచేసుకున్న 350 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, బన్సీలాల్పేట కార్పొరేటర్ కే హేమలత, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కణ్ణన్, డీఎంఈ వాణి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్నాయక్, సికింద్రాబాద్ ప్ర భుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.