మెదక్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మెతుకుసీమ ప్రజల దశాబ్దాల రైలు కల సాకారమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితో మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పూర్తయ్యింది. ఎట్టకేలకు తమ ప్రాంతానికి రైలు రావడంతో జిల్లాప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతోపాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, రఘునందన్రావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరున్కుమార్ జైన్తో కలిసి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెదక్ రైల్వేలైన్ పూర్తి కోసం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఎంతో కృషిచేశారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణలో రైల్వేలు అభివృద్ధి చేసుకుందామన్నారు.
మెదక్కు మహర్దశ: ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ప్రారంభంతో మెదక్ ప్రాంతానికి మహర్దశ పట్టనున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. 2014లో మెదక్లో రైల్వేలైన్ కోసం శంకుస్థాపన చేశారని, మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ 17.2 కిలోమీటర్ల మేర రూ.205 కోట్లతో పూర్తిచేసినట్టు వివరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు రైల్వే లైన్కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. మెదక్ నుంచి జోగిపేట, సంగారెడ్డి, ఈదుల నాగులపల్లి, ముంబై రైల్వే లైన్లకు కలుపాలని కిషన్రెడ్డిని కోరారు. మెదక్ నుంచి కాచిగూడ వరకు ఒక ప్యాసింజర్ రైలుతో పాటు మహబూబ్నగర్ నుంచి కాచిగూడ మీదుగా మెదక్కు మరో ప్యాసింజర్ రైలును దక్షిణ మధ్య రైల్వే నడపనున్నదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడటంతో మెదక్లో సమీకృత కలెక్టరేట్, జాతీయ రహదారులు నిర్మించడంతోపాటు నూతనంగా మెదక్కు రైల్వే లైన్ రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
ఎన్నో ఏండ్ల కల సాకారం: పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ వాసుల 60 ఏండ్ల కల సాకారమైందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. 2012లో యూపీఏ ప్రభుత్వం రైల్వేలైన్ మంజూరు చేస్తే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రూ.202 కోట్లతో పూర్తి చేశాయని తెలిపారు. ఈ రైల్వే లైన్ కోసం రైతుల నుంచి 375 ఎకరాల భూమి సేకరించామని, ఇందులో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని వివరించారు. రైతుల నుంచి సేకరించిన భూమికి తెలంగాణ ప్రభుత్వమే రూ.17 కోట్లు పరిహారంగా చెల్లించిందని పేర్కొన్నారు. మెదక్లో ఏడుపాయల, పోచారం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ఉన్నందున జిల్లాలో టూరిజం అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయాలని కిషన్రెడ్డిని కోరారు.