సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 28: ఐఐటీలో నిర్మించిన అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీ అద్భుత రోబోటిక్ టెలిస్కోప్ అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఐఐటీ హైదరాబాద్లో అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీ (ఏడీవో)ని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, కోల్కతాలోని ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాణిగ్రాహితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాధాకృష్ణన్, ‘అద్భుతమైన ఇస్రోతో ప్రయాణం-నా జీవిత పాఠాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఐఐటీలోని అన్ని ఇంజినీరింగ్ సైన్స్ సామర్థ్యాలను ఒక చోట చేర్చి అంతరిక్ష పరిశోధన కోసం ఒక కొత్త పరికరాన్ని రూపొందిస్తే, పరిశోధనల్లో ప్రధాన సహకారిగా నిలుస్తారని చెప్పారు.
భవిష్యత్లో మరిన్ని కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీ భౌతికశాస్త్ర విభాగం చేస్తున్న కృషిని ప్రశంసించారు. నక్షత్రాలు, వాటి ఉనికి, అనేక ఇతర ప్రశ్నలు, సందిగ్ధతల గురించి తెలుసుకోవడం ఎవరినైనా ఉత్తేజ పరుస్తుందన్నారు. ఒక ప్రత్యేక ఏడీవో కింద 14 అంగుళాల టెలిస్కోప్ను ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మయూఖ్ పహరీ, ఆయా విభాగాల డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.