Vote | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాట ఓ పజిల్గా మారనున్నది. ప్రధాన అభ్యర్థులకు పోటీగా అదే పేరున్న వ్యక్తులు స్వతంత్రులుగా ఆయా చోట్ల పోటీ చేయడం గమనార్హం. దీంతో తాము ఓటేసే అభ్యర్థిని ఎంచుకునే విషయంలో గందరగోళం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రధాన అభ్యర్థి ఎవరు? స్వతంత్ర అభ్యర్థి ఎవరు అనేది ఓటర్లలో అయోమయం నెలకొననున్నది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చి వారి విజయాన్ని ప్రభావితం చేసేలా అదే పేరున్న కొందరు వ్యక్తులు కావాలనే పోటీ చేయగా, మరికొందరు ఆ పార్టీ వ్యతిరేక పార్టీలు వెతికి మరీ అదే పేరున్న అభ్యర్థులతో నామినేషన్లు వేయించారని ప్రచారం జరుగుతున్నది. అభ్యర్థుల ఇంటి పేరు వేరైనా అసలు పేరు ఒకటే కావడంతో తలనొప్పిగా మారిందని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఒకే పేరున్న స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను కొన్నిచోట్ల స్క్రూట్నీలో తిరస్కరించగా మరికొందరు బరిలోనే ఉన్నారు. దీంతో ప్రధాన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అభ్యర్థుల పేరుతో పాటు ఇంటిపేరూ ఒకటే ఉండటం మరింత గందరగోళానికి దారితీయనున్నదని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది.
ప్రధాన అభ్యర్థులు.. అదే పేరున్న ప్రత్యర్థులు
☛ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ పోటీ చేస్తుండగా.. ఏ అజయ్, కే అజయ్ పేరున్న అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిచిచారు.
☛ కొడంగల్లో పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ప్యాట నరేందర్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
☛ నారాయణపేటలో ఎస్ రాజేందర్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండగా, కే రాజేందర్రెడ్డి ఇండిపెండెంటుగా నిలిచారు.
☛ హుజూర్నగర్లో శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కాగా, ఏడీఆర్ నుంచి టీ సైదిరెడ్డి బరిలో ఉన్నారు.
☛ మహబూబ్నగర్లో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్పై స్వతంత్ర అభ్యర్థిగా ఎం శ్రీనివాసులుగౌడ్ పోటీలో ఉన్నారు.
☛ ఉప్పల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి, ఏడీఆర్ పార్టీ అభ్యర్థిగా మన్నె లక్ష్మారెడ్డి రంగంలో ఉన్నారు.
☛ ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషనరెడ్డి బీఆర్ఎస్ నుంచి, కే కిషన్రెడ్డి ఏడీఆర్ నుంచి పోటీలో ఉన్నారు.
నేమ్, సర్నేమ్.. సేమ్!
☛ మునుగోడులో బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఏడీఆర్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
☛ ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పక్షాన దేవిరెడ్డి సుధీర్రెడ్డి, స్వతంత్రులుగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి, డీ సుధీర్రెడ్డి నిలిచారు.
☛ మిర్యాలగూడలో బీ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీ లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.
☛ మహేశ్వరంలో బీఆర్ఎస్ నుంచి పీ సబిత, స్వతంత్ర అభ్యర్థిగా ఎం సబిత, కాంగ్రెస్ నుంచి కే లక్ష్మారెడ్డి, జనశంఖారావం నుంచి కే లక్ష్మారెడ్డి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
☛ దేవరకద్రలో ఏ వెంకటేశ్వరరెడ్డి ఉండగా, అదే పేరున్న అభ్యర్థి స్వతంత్రుడి బరిలో దిగారు.
☛ అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై అదే పేరున్న అభ్యర్థి ఏడీఆర్ పార్టీ పక్షాన నిలిచారు.