హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం కొత్తగా టూరిజం పాలసీ-2025-30 తీసుకువచ్చామని, దాని ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాబడతామని నిరుడు బడ్జెట్ సమావేశాల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ఈ పాలసీ ద్వారా ఇప్పటివరకు కనీసం రూ.కోటి పెట్టుబడులు కూడా తీసుకురాలేదు. దీంతో పర్యాటక రంగంపై రేవంత్రెడ్డి సర్కార్కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. కానీ, శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో టూరిజం పాలసీ ద్వారా రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదన దశలో ఉన్నాయని బీరాలు పలికిన రేవంత్రెడ్డి సర్కార్.. ఈసారి బడ్జెట్లో పర్యాటక రంగం అభివృద్ధికి కేటాయించింది. రూ.1,224 కోట్లు మాత్రమే. దీంతో ఈ నిధులు సరిపోవని, పర్యాటక రంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
3 లక్షల మందికి ఉద్యోగాలన్నారు..
రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఎకో టూరిజం, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం, ఎంఐసీఈ టూరిజం, స్పోర్ట్స్ టూరిజంగా విభజించారు. తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు కనీసం 100 మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ఇప్పుడు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పడం యువతను మోసగించడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.