హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మునుగోడులో బీజేపీ కుదేలు అయింది. టీఆర్ఎస్ ఇచ్చిన షాక్తో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రచారం వెలవెలబోతున్నది. కాసులు కురిపించినా.. కాలుకాలు తిరిగినా కమలం పార్టీని నమ్మే స్థితిలో మునుగోడు లేదని రాజగోపాల్రెడ్డికి తత్వం బోధపడుతున్నది. జనం వెర్రిబాగులోళ్లు కాదని కోమటిరెడ్డి శిబిరానికి తెలిసివస్తున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారం మునుగోడును చుట్టుముట్టింది. ఒకవైపు టీఆర్ఎస్ సంధిస్తున్న ప్రశ్నలు, మరోవైపు ప్రజల ధిక్కార స్వరం వెరసి రాజగోపాల్కి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ప్రచారంలో అంతా తామై వ్యవహరించిన నేతల్లో నైరాశ్యం కనిపిస్తున్నది.
బీజేపీ కుట్ర వ్యవహారాన్ని మునుగోడు ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాము ముందు తెలంగాణ బిడ్డలమని.. ఆ తరువాతే రాజకీయ నాయకులమని, పార్టీలకు అతీతంగా బీజేపీ డ్రామాలకు చరమగీతం పాడతామని గురువారం ప్రతినబూనారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని గర్జించారు. ఈ వరుస పరిణామాలతో రాజగోపాల్రెడ్డి ప్రచార శిబిరం ఒక్కసారిగా డీలా పడింది. ఇప్పటి దాకా నల్లగొండ జిల్లాలో తమకు ఎదురేలేదని విర్రవీగిన కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ కోకు టీఆర్ఎస్ గట్టిషాక్ ఇచ్చింది.
వరుస ఘటనలతో కకావికలం అవుతున్న రాజగోపాల్రెడ్డి.. తన ప్రచారాన్ని రోజురోజుకు కుదించుకుంటున్నారు. ప్రచారాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. గురువారం చండూరు మండలం చొప్పరివారిగూడెం, గుండ్రపల్లి, తుమ్మలపల్లి, తిమ్మారెడ్డిగూడెం, ధోనిపాముల, జోగిగూడెం, నర్మెట, కొండాపురం, పుల్లెంల, ఇడికుడ, బంగారిగడ్డ తదితర గ్రామాల్లో రోడ్షో నిర్వహిస్తామని రాజగోపాల్రెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. కానీ, ఒక్కటిరెండు గ్రామాల్లో నిర్వహించి మమ అనిపించారు. ఎన్ని చేసినా ఫలితం తనకు అనుకూలంగా వచ్చేలా లేదని రాజగోపాల్రెడ్డి డిసైడ్ అయ్యారా? జనం తనకు ఓటేయ్యరని ఫిక్స్ అయ్యారా?.. అంటే మునుగోడులో జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర లేపిందని రాష్ట్రమే కాదు, దేశమంతా కోడై కూయటంతో మునుగోడు బీజేపీ బిత్తరపోయింది. రాజగోపాల్రెడ్డికి థర్డ్ప్లేస్ అని జనం గుండెచప్పుడు విన్నవారంతా తేల్చిచెప్తున్నారు. అది నిజమేనని గురువారం బీజేపీ నేతల వ్యవహారం చూస్తే ఇట్టే తెలిసిపోతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మునుగోడులో గురువారం బండి సంజయ్, అర్వింద్, వివేక్, చంద్రశేఖర్, నల్లు ఇంద్రాసేనారెడ్డి తదితరులు నిర్వహించిన మీడియా సమావేశంలో నైరాశ్యం రాజ్యమేలింది. ‘ఏమైందో వాళ్ల ముఖాలన్నీ పిడుగుపడ్డట్టు మాడిపోయి.. వాళ్ల కాళ్ల కింద కంపఉన్నట్టు ఉన్నరు’ అనేలా నేతల ముఖాలన్నీ వైరాగ్య ప్రశాంతతను సంతరించుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రాజగోపాల్రెడ్డికి కాళ్లూచేతులు ఆడని పరిస్థితి నెలకొన్నది. ‘ఈ.. కొడుకులు ఇట్ల చేస్తరని ఎవనికెరుక?’ అని ఆయన సన్నిహితుల వద్ద బీజేపీ నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారట!