పాలకవీడు, జూలై 2: రెక్కలకష్టమే ఆస్తిగా నేలతల్లిని నమ్ముకొని బతుకుతున్న ఓ సామాన్య రైతు కుటుంబం పెద్ద ఆపదలో పడింది. పుట్టింది మొదలు 22 రోజులుగా వెంటిలేటర్పైనే ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లుతున్నది. శిశువును బతికించుకొనేందుకు దొరికిన చోటల్లా అప్పు తెచ్చి రూ.11 లక్షలు వైద్యానికి ఖర్చు చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు పసిప్రాణానికి పునర్జన్మను ప్రసాదించాలని దాతల సాయం వేడుకొంటున్నారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలేనికి చెందిన సారెడ్డి రాంరెడ్డి కౌలు రైతు. తనకున్న ఎకరం పొలంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నా డు. ఏడు నెలల గర్భిణి అయిన రాంరెడ్డి భార్య ధనలక్ష్మికి గత నెలలో విపరీతమైన కడుపునొప్పి రావడంతో మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లారు. గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడటంతోపాటు గర్భస్థ శిశువుకు రక్త సరఫరా సరిగా జరగడం లేదని గుర్తించిన వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పడంతో సికింద్రాబాద్లోని కిమ్స్లో చేర్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి డాక్టర్లు జూన్ 9న సిజేరియన్ చేశారు.
పెద్ద ప్రాణానికి గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్నా శిశువు పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. 750 గ్రాముల బరువుతో పుట్టిన మగబిడ్డలో అవయవాల ఎదుగుదల పూర్తిస్థాయిలో జరగలేదు. దాంతో పుట్టినప్పటి నుంచి ఎన్ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స చేస్తున్నారు. బాబు వైద్యం కోసం రాంరెడ్డి ఇప్పటికే 11లక్షలకుపైగా అప్పుచేశాడు. బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారికి ఏ రోజుకారోజు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు దవాఖానలో ఉం చాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతలు స్పందించి తమ బిడ్డను బతికించాలని ప్రాధేయపడుతున్నారు.
సాయం కోసం :ఫోన్పే/గూగుల్ పే నంబర్ : 9640318590
బ్యాంకు అకౌంట్ : సారెడ్డి రాంరెడ్డి
అకౌంట్ నంబర్ : 62301738365
ఐఎఫ్ఎస్సీ : ఎస్బీఐఎన్0021538
బ్రాంచి: దిర్శించర్ల