హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వరదలతో పెను ముప్పు పొంచి ఉన్నదని ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) బృందం ఆందోళన వ్యక్తం చేసింది. వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇస్రో, ఎన్ఆర్ఎస్సీ సహా మరికొన్ని సంస్థలు కలిసి ప్రత్యేక నివేదిక రూపొందించాయి. 1990-2022 మధ్య కాలంలో ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తించి, రాష్ర్టాలు, జిల్లాల వారీగా భవిష్యత్తులో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను అంచనా వేశాయి. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 40 మిలియన్ హెక్టార్ల భూములు నీట మునుగుతున్నాయి.
ఉపగ్రహాలతో వరదలపై నిఘా
హై రిజుల్యూషన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం వంటి సాంకేతికతల ద్వారా పరిశోధకులు వాతావరణం, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ఇందులో ఫ్లడ్ మ్యాపింగ్, ఫ్లడ్ మానిటరింగ్, ఫ్లడ్ డ్యామేజ్ విభాగాల తాజా సమాచారాన్ని ఇస్రో-ఎన్ఆర్ఎస్సీ రూపొందించింది.
తెలంగాణలో 1.02 లక్షల హెక్టార్లకు ..
1998-2022 గణాంకాల ఆధారంగా రూపొందించిన శాటిలైట్ డాటా ప్రకారం దేశవ్యాప్తంగా 24 రాష్ర్టాల్లోని 435 జిల్లాల్లో 1.57 లక్షల హెక్టార్ల భూములు వరద ప్రభావానికి గురయ్యాయి. తెలంగాణలో 1.02 లక్షల హెక్టార్లకు ముప్పు ఉన్నదని నివేదికలో తేలింది. ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, బీహార్, గుజరాత్, యూపీ, ఆంధ్రప్రదేశ్కు వరదల ముంపు తీవ్రత ఎక్కువగా ఉన్నది.
గోదావరి పరివాహకంలో ఎక్కువ
భద్రాచలం, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలోని 10 వేల హెక్టార్లలో వరద చేరే లోతట్టు ప్రాంతాలను ఇస్రో గుర్తించింది. 2006 నుంచి ఇప్పటి వరకు సంభవించిన వరద విపత్తుల వారీగా అత్యధికంగా 2020 ఆగస్టులో కురిసిన అతి భారీ వర్షపాతంతో 7 జిల్లాలు అతలాకుతలం అయినట్టు తేల్చింది.