హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏపీకి విద్యుత్తు బకాయిలను చెల్లించాలని తెలంగాణపై ఏవిధమైన ఒత్తిడీ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు చేపట్టరాదని తేల్చి చెప్పింది. తెలంగాణ విద్యుత్తు సంస్థల వాదనలు వినకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఏకపక్షమని వ్యాఖ్యానించింది. కేంద్రంతోపాటు ఏపీ విద్యుత్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి విద్యుత్తు సరఫరా బకాయిలు రూ.3441.78 కోట్లు, ఈ మొత్తం చెల్లింపులు జాప్యమైనందున సర్ చార్జి, ఇతర చార్జీల కింద అదనంగా రూ.3315.14 కోట్లు కలిపి మొత్తం రూ.6756.92 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర విద్యుత్తుశాఖ ఆగస్టు 29న జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. దీనిపై జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, విద్యుత్తు సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది వై రామారావు వాదనలు వినిపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు ఏర్పడితే వాటిని దక్షిణ ప్రాంత మండలిలో పరిషరించుకోవాలన్న నిబంధనకు వ్యతిరేకంగా కేంద్రం ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశించిందన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ అభ్యర్థులకు ఏపీలో అధికార పార్టీ మద్దతు ఇచ్చినందునే కేంద్రం ఏపీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.
తెలంగాణను దెబ్బతీయాలనే కుట్రతోనే కనికరం లేకుండా తెలంగాణపై పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని అన్నారు. అపెక్స్ బాడీలో చర్చ కూడా చేయకుండా ఏకపక్షంగా కేంద్రం ఆదేశాలు జారీ చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం వల్ల ఉత్పన్నమైన సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పెండింగ్లో ఉండగానే విద్యుత్తు బకాయిల విషయంలో తొందరపడి ఎందుకు నిర్ణయం తీసుకున్నదో యోచన చేస్తే కేంద్ర ప్రభుత్వ నిజరూపం బట్టబయలు అవుతుందని తెలిపారు. కేంద్రం ఆదేశాల నిలుపుదలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఏపీ విద్యుత్తు సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి బకాయిల చెల్లింపులు జరిగేలా చూడాలని ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి కోరారు. చేసిన రుణాలు తీర్చని కారణంగా ఏపీ విద్యుత్తు సంస్థలు అప్పుల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రాల విభజన తర్వాత ఉత్పత్తి చేసిన విద్యుత్తును తెంగాణకు సరఫరా చేసినందున ఆ బిల్లులను చెల్లించాలని కోరుతున్నామని, దీనికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వర్తించదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి చెప్పడం వల్లే ఏపీ విద్యుత్తు సంస్థలు తెలంగాణకు కరెంట్ సరఫరా చేశాయని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి విద్యుత్తు బకాయిల బిల్లులు చెల్లించాలని తెలంగాణను ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. వాదప్రతివాదనల తర్వాత.. తెలంగాణ వాదనలు వినకుండానే బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.
అందుకే బకాయిలు చెల్లించాలని తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణపై ఏవిధమైన ఒత్తిళ్లు చేయరాదని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. ప్రతివాదులైన కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి, ఏపీ విద్యుత్తు శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో ఎండీ, ఢిల్లీలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.
తెలంగాణ హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి పదవీ విరమణ చేయనున్న సందర్భంగా బుధవారం ఆమెకు హైకోర్టు వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన న్యాయమూర్తులంతా సమావేశమై వీడోలు చెప్పారు. జస్టిస్ శ్రీదేవి 14,185 ప్రధాన కేసులను, 6,493 ఇతర కేసులను పరిషరించారని సీజే చెప్పారు. ఏపీకి చెందిన శ్రీదేవి 2005లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. 2018లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. కార్యక్రమంలో ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.