విష్ణుమూర్తి శిరస్సు ఎడమవైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేలా.. శ్రీదేవి, భూదేవి సమేతంగా చెక్కారు. గరుత్మంతుడు, నారదమహర్షి, తుంబురుడు, సప్తరుషులు, విష్ణుభక్తుల ఆకృతులతో ఈ భారీ శిల్పం దర్శనమిస్తున్నది.
Lord Vishnu | హైదరాబాద్ సిటీబ్యూరో/కంటోన్మెంట్, జూలై 1 (నమస్తే తెలంగాణ): వెయ్యేండ్లకుపైగా పాతదైన భారీ టేకు దుంగను పరిరక్షించాలని.. ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేషశయన విష్ణుమూర్తి విగ్రహంగా మలిచారు. 21 అడుగుల వెడల్పు, ఎనిమిదిన్నర అడుగుల పొడవు టేకు దుంగతో అద్భుతమైన ఆధ్యాత్మిక శిల్ప కళాఖండంగా తీర్చిదిద్దగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ఆవిష్కరించారు. ఐదేండ్ల సుదీర్ఘ కాలంపాటు నిర్విరామంగా శిల్పాన్ని చెక్కినట్టు విగ్రహ రూపశిల్పి గిరిధర్గౌడ్ తెలిపారు.
న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ ఎస్టేట్ సంస్థ బర్మాలో ఈ అరుదైన టేకుదుంగను సేకరించింది. దీనితో ఫర్నిచర్ తయారు చేయకుండా.. ఆధ్మాత్మిక శోభను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో భారీ శిల్పంగా మలిచినట్టు టింబర్ నిర్వాహకులు చదలవాడ తిరుపతిరావు వివరించారు. అన్ని అనుమతులు పొందటానికి దాదాపు మూడేండ్ల సమయం పట్టిందని, బర్మా నుంచి ఇక్కడికి సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చినట్టు తెలిపారు.