దుబ్బాక, డిసెంబర్ 3: పేదరికం కారణం గా ఉన్నత విద్యకు దూరమై.. గొర్రెలు మేపుతున్న విద్యార్థినికి అండగా నిలిచారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి, స్వామి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వీరి కూతురు కల్యాణి 2020లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసింది. ఆ బ్యాచ్లో 60 మంది ఉండగా కల్యాణి టాపర్గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువుకు దూరమై ఇంట్లోనే ఉంటున్నది. కుట్టుమెషిన్ పని నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా నిలిచింది. ఇక రెండో కుమార్తె స్రవంతి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసింది. బీఎస్సీ (హార్ట్టికల్చర్) చదవాలని హార్టిసెట్ రాసి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఈనెల 5న కౌన్సెలింగ్ కు హాజరుకావాలి. అదేరోజు రూ.50 వేలు చెల్లిస్తేనే సీటు దక్కుతుంది. నాలుగేండ్లకు కలిపి మరో రూ.4 లక్షలు వరకు ఖర్చవుతా యి.
ఆ కుటుంబానికి అంత మొత్తం వెచ్చించే స్థోమత లేదు. పేదరికం వేధిస్తున్నా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరి పట్టుదలగా చదివింది. బీఎస్సీ (హార్టికల్చర్)లో చేరి ఉన్నతంగా రాణించాలని కలలుకంటున్న ఆమె.. తండ్రి తో కలిసి గొర్రెలు మేపడానికి వెళ్తున్నది. దాతలు ఎవరైనా స్పందిస్తే బాగా చదువుకోవాలని ఆశిస్తున్నది. మూడో అమ్మాయి ప్రస్తు తం మాడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నది. స్రవంతి ఉన్నత విద్యకు పూర్తి స్థాయి లో సహకరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడంతో భవిష్యత్తుపై మళ్లీ ఆశలు చిగురించాయి. పేదరికానికి ఉన్నత విద్య దూరం కాదని, మంత్రి కేటీఆర్ ఇచ్చిన భరోసాతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తున్న ది. ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు రణం శ్రీనివాస్ విద్యార్థిని స్రవంతిని సన్మానించి ఈ విషయాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తనవంతు సాయం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.