హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో మేజిస్ట్రేట్ విధించిన రిమాండ్ ఉత్తర్వుల అమలును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. కావాలంటే కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సూచించింది. బండి సంజయ్ దాఖలు చేసిన అత్యవసర లంచ్మోషన్ పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. సీనియర్ న్యాయవాది ఎన్ రామచందర్రావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ను అరెస్టు చేశారని చెప్పారు. ఎఫ్ఐఆర్లో పిటిషనర్కు వ్యతిరేకంగా ఏవిషయాలూ లేవని తెలిపారు. ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్ వస్తున్నందున కావాలని కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రతివాదన చేస్తూ, పదో తరగతి పేపర్లు లీక్ చేయడానికి బండి సంజయ్ తెరవెనుక కీలక పాత్ర పోషించారని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర చేశారని పేర్కొన్నారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసికంగా దెబ్బతీశారని అన్నారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ తన హకులను అనుభవించవచ్చునని, కానీ ఆయన చట్ట నిబంధనలను ఉల్లంఘించే హకు లేదని చెప్పారు. ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే కుట్రలో నాలుగున్నర లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని తెలిపారు. ఈ కుట్రలోకి ఓ బాలుడిని కూడా లాగారని చెప్పారు. హైకోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
బండి సంజయ్ తన సెల్ఫోన్ ఇవ్వలేదని, ఆ ఫోన్లో ఎంతో కీలక సమాచారం ఉన్నదని ఏజీ చెప్పారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆయనది కీలకపాత్ర అని, తెరవెనుక చేసిన కుట్ర కోణాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. నిందితుడు తన మొబైల్ ఫోన్ నుంచి ఇతర నిందితుల ఫోన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపారని, పేపర్ లీకేజీ జరిగేలా ఇతరులను ప్రోత్సహించారని, ఈ మేరకు కీలక సమాచారం పోలీసుల వద్ద ఉన్నదని చెప్పారు. బాధ్యతగల ఎంపీగా ఉన్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయాలే గానీ పేపర్ లీక్ అయ్యిందనేలా పిల్లల్లో భయాందోళన రేకెత్తేలా చేయకూడదని అన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. పిటిషనర్ బెయిల్ కోసం సంబంధిత కింది కోర్టును ఆశ్రయించవచ్చునని సలహా ఇచ్చింది. రిమాండ్ రిపోర్టును రద్దు చేయబోమని తేల్చి చెప్పింది. రిమాండ్ ఉత్తర్వుల చట్టబద్ధతపై విచారణ జరుపుతామని తెలుపుతూ.. ప్రభుత్వానికి, ఫిర్యాదుదారు కమలాపురం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు ఎం శివప్రసాద్కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. బండి సంజయ్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న తీరును సవాల్ చేస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.