కోటగిరి, ఆగస్టు 6: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లాపల్లి అబాది, జల్లాపల్లి (పాత), జల్లాపల్లి ఫారంలో శనివారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా పరిపాలించిన గుజరాత్లో కూడా తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు లేవన్నారు. అక్కడ పేదలకు పింఛన్ నెలకు కేవలం రూ.600 మాత్రమేనని, అదే తెలంగాణలో నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున సీఎం కేసీఆర్ ఇస్తున్నారని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే రూ.5 వేల కోట్లు ఇస్తామని ప్రధాని మోదీ చెప్పినా అంగీకరించకుండా సీఎం కేసీఆర్ గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. గ్రామాల్లోకి వచ్చి మాయమాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దని సూచించారు. ఉద్దెర మాటలు చెప్పే వాళ్లతో దూరంగా ఉండాలని కోరారు.