1857లో దేశవ్యాప్తంగా సిపాయిల తిరుగుబాటు జరిగేందుకు రెండేళ్ల ముందే హైదరాబాద్లో బ్రిటిషర్లపై ఇక్కడి సైనికులు తిరుగుబావుటా ఎగురువేశారు. బొల్లారంలోని సైనిక శిబిరం ఈ తిరుగుబాటుకు వేదికగా నిలిచింది. 1855 సెప్టెంబర్లో మొహర్రం సందర్భంగా ఇది జరిగింది.
మొహర్రం జరుపుకునే ముస్లింలకూ, ఓ క్రైస్తవ మత ప్రచారకుడికి మధ్య తలెత్తిన గొడవ కంటోన్మెంట్లో ఉద్రిక్తత సృష్టించింది. కొత్తగా క్రైస్తవం తీసుకున్న ఓ అఫ్గాన్.. ముస్లింల మధ్యకు వెళ్లి క్రైస్తవం గురించి బోధించడం మొదలుపెట్టాడు. మొహర్రం సందడిలో ఉన్న ముస్లింలు అతడిని రాళ్లతో తరిమికొట్టారు. ఇదే సంఘటన రెండుమూడుసార్లు జరిగింది. బ్రిగేడియర్ మెకంజీ అనే బ్రిటిష్ సైనికాధికారి గుర్రాలపై జరిపే మొహర్రం ఊరేగింపును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. ఇది కంటోన్మెంట్లోని ముస్లింలకు మరింత ఆగ్రహం తెప్పించింది.
మేజర్ ఓర్ అనే మరో అధికారి సూచన మేరకు ఆ ఉత్తర్వును ఉపసంహరించుకున్నప్పటికీ అందరికీ ఆ సంగతి చేరేందుకు సమయం పట్టింది. మొహర్రం రోజు జెండాలతో ఊరేగింపు మొదలైంది. వాయిద్యాలతో ఊరేగింపు మెకంజీ ఇంటిముందు నుంచి వెళ్తుండగా ఆయన బయటకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. జెండాలను, ఇతర ఊరేగింపు సరంజామాను స్వాధీనం చేసుకున్నాడు. ఓ ఇద్దరిని అక్కడే కూర్చోబెట్టుకుని మిగతా వారిని పంపించివేసాడు. ఈ సంగతి తెలిసి కంటోన్మెంట్లోని సైనికులు భగ్గుమన్నారు.
బ్రిగేడియర్ మెకంజీ ఇంటిమీదకు ఓ గుంపు దాడికి వెళ్లింది. గులాం ఖాదర్ అనే ఆశ్వికదళ సవార్ ఈ దాడి సందర్భంగా కత్తి విసిరితే మెకంజీ తలకు గాయమైంది. వచ్చిన గుంపు జెండాలను తీసుకుని వెళ్లిపోయింది. మరుసటిరోజు దాడిలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు పరేడ్లు జరిపారు. కానీ మెకంజీ ఇంటిమీద దాడికి పాల్పడిన వారిని ఎవరూ గుర్తించలేదు. సికింద్రాబాద్ నుంచి బ్రిటిష్ దళాలను రప్పించి రెజిమెంట్లో మళ్లీ పరేడ్లు నిర్వహించారు.
చివరికి మెకంజీపై దాడికి పాల్పడింది ఖాదర్ అని మహమ్మద్ హుస్సేన్ అనే దఫేదారు బ్రిటిషు అధికారులకు వెల్లడించాడు. అతడిని వెంటనే నిర్బంధించారు. తర్వాత రెజిమెంటు సైనికులు బారక్స్కు వెళ్లారు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన బ్రిటిష్ దళాలు వెనక్కి వెళ్లాయి. దాడి జరిగిన రోజు రెజిమెంట్లో ఉన్న స్వదేశీ దళనాయకులు, దఫేదార్లను సైన్యం నుంచి తొలగించారు. ఇతర రెజిమెంట్ల నుంచి అధికార్లను తెచ్చి ఇక్కడ నియమించారు.