హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సంస్థ నిర్వహించే ఎమ్మార్సీఎస్ ఇంటర్ కొలీజియేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న సర్జన్లలో నైపుణ్యాలు, జ్ఞానం మరింత పెంపొందుతాయని కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్ తెలిపారు.
రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మకమైన ఎమ్మార్సీఎస్ ఫైనల్ ఎగ్జామ్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏటా జరిగే ఎమ్మార్సీఎస్ పరీక్ష హైదరాబాద్ నగరంలో తొలిసారిగా 2015లో నిర్వహించారని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 17నుంచి 22 వరకు ఆరు రోజులపాటు నిర్వహించే ఈ పరీక్షలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 240 మంది సర్జికల్ ట్రైనీలు, యూకేతోపాటు దేశంలోని 35 మంది ఎగ్జామినర్లు నగరానికి వచ్చారని వివరించారు.