హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. కేంద్రం తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్ష నేపథ్యంలో అక్కడి వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కేంద్రాన్ని నిలదీసేలా టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన హోర్డింగులు ఆసక్తి రేపుతున్నాయి. వివిధ డిజైన్లతో కూడిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, తెలంగాణ రైతాంగంపై కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించేలా హోర్డింగు ఏర్పాటుచేశారు. ఇప్పటికే వారంరోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ నిరసన వ్యక్తంచేస్తున్నది. ‘రైతుల ప్రయోజనాలు కాపాడాలి’, ‘ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ’ నినాదంతో ఉన్న ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి. ఏ ఇద్దరు జాతీయ నేతలు కలిసినా కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ దీక్ష గురించే చర్చించుకుంటున్నారు.
రైతు సమస్యల పరిష్కారానికి సోమవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వం లో చేపట్టే ధర్నాకు టీఎస్ ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్లోని టీఎస్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.
దమ్ముంటే ధాన్యం కొనిపించు
బండికి సీపీఐ నేత చాడ డిమాండ్
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 9: రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని ప్రగల్భాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రం తో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా నారాయణపురంలో ఆయన మాట్లాడారు.