కోదాడ టౌన్, జులై 21 : పసి పిల్లలు తాగే పాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం సిగ్గుచేటని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మాట్లాడుతూ…పాలపై పన్ను విధించిన ఘటన దేశచరిత్రలో ఎన్నడు జరుగలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పన్నులు విధించడంతో పేద, మధ్యతరగతి వర్గాల బతుకు కష్టంగా మారిందన్నారు.
పాలపై పన్ను విధించడంతో పాడి రైతులు అందరు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం బేషరతుగా పాల ఉత్పత్తుల పై జీఎస్టీని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, ఎంపీపీ కవిత రాధ, పట్టణ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ , జిల్లా బ్యాంకు సొసైటీ డైరెక్టర్ కొండా సైదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.