హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ‘నేతన్నకు చేయూత’ పథకంలో భాగంగా అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో సెప్టెంబర్ 1 నుంచి డబ్బు జమ చేయనున్నారు. నేతన్నల పొదుపుకు సంబంధించి ఇదివరకే దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. ఇటీవలే ప్రభుత్వం తమవాటా కింద రూ.30 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల మొత్తం 35 వేలమంది కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. పొదుపు చేసుకున్న సొమ్మును మూడేండ్ల తర్వాత అంటే 2024లో తీసుకునే వీలుంటుంది. కార్మికుడు పొదుపుచేసే ఎనిమిది శాతం వేతన వాటాకు రెట్టింపు.. అంటే 16 శాతం ప్రభుత్వం జోడిస్తున్నది. రాష్ట్రంలోని సుమారు 25 వేలమంది చేనేత కార్మికులు, మరో పది వేలమంది పవర్లూమ్ కార్మికులు కలిపి మొత్తం 35 వేలమందికి ఈ పొదుపు పథకం వర్తిస్తుంది. తెలంగాణ రాకముందు చేనేత కార్మికులకు మాత్రమే వర్తించిన ఈ పథకాన్ని రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి చేనేత కార్మికుడితోపాటు డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్స్, వైండర్స్ తదితర చేనేత అనుబంధ పనివారికి కూడా వర్తింపజేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో లేని చేనేత పనివారికి కూడా తాజాగా ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. క్రితంసారి కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గడువును సడలించి ముందే తమ మొత్తాలను విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో నేతన్నలకు సుమారు రూ.109 కోట్ల మేర ప్రయోజనం కలిగింది.