రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగాణలో వ్యవసాయమే పండుగైంది. ఇదీ టీఆర్ఎస్ సర్కారు సాధించిన అసలుసిసలైన ఘనత.
దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలు దాకా అనేక సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్గా నిలుస్తున్నది. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతు సంక్షేమం కోసం 30 వరకు పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్మాడల్గా నిలుస్తున్నది.
వినూత్న కార్యక్రమాలతో దేశానికి రోల్మాడల్
కాళేశ్వరం.. రైతు కోసం
రైతు బంధు.. రైతు కోసం
రైతు బీమా.. రైతు కోసం
రైతు వేదికలు.. రైతు కోసం
కల్లాల నిర్మాణం.. రైతు కోసం
మిషన్ కాకతీయ.. రైతు కోసం
సబ్సిడీ విత్తనాలు.. రైతు కోసం
ధాన్యం కొనుగోళ్లు.. రైతు కోసం
24 గంటల కరెంటు.. రైతు కోసం
సాగునీటి ప్రాజెక్టులు.. రైతు కోసం
ఇదే కదా! అసలైన రైతు రాజ్యం
వ్యవసాయం పండుగైన రాష్ట్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న సామెతను గట్టిగా నమ్మే వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే రాష్ట్రం ఏర్పాటు కాగానే ఆయన దృష్టి ప్రధానంగా రైతు సంక్షేమం, వ్యవసాయరంగంపైనే కేంద్రీకరించారు. 2014లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలుంటే ప్రస్తుతం అది 2.03 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదే విధంగా 2014లో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులైతే ప్రస్తు తం అది 2.49 కోట్ల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతు పథకాలు తమకూ కావాలని దేశ రైతాం గం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నది.
1. రైతుబంధు
పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుకు గల మొత్తం భూమికి ప్రభుత్వం రైతుబంధు అందిస్తున్నది. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రూ. 57,882 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయగా 10వ విడత నిధులు రూ. 7600 కోట్లను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయనుంది. దీంతో ఇప్పటి వరకు రైతుబంధుకు ఖర్చు చేసిన నిధుల మొత్తం రూ. 65,482 కోట్లు కానున్నది. ఈ పథకం ద్వారా ప్రతియేటా సుమారు 65 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.
2. రైతు బీమా
కారణం ఏదైనా సరే రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డుపై పడకుండా వారికి రైతుబీమా ద్వారా రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను అందిస్తున్నది. ఇప్పటి వరకు 93,170 మంది రైతు కుటుంబాలకు రూ. 4658.50 కోట్లు బీమా రూపంలో అందించింది. రైతుబీమాకు సంబంధించిన ప్రీమియం కూడా రైతుల తరుపున ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
3. పంటలబీమా
ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి నష్ట పరిహారం అందజేస్తున్నది. 2014-15 సంవత్సరం నుంచి 2019-20 వరకు ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన వివిధ జిల్లాల్లోని 20.98 లక్షల మంది రైతులకు 2462.83 కోట్ల రూపాయల పరిహారం అందించింది.
4. గొర్రెల పంపిణీ
ప్రభుత్వం రూ. 11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసి 3.93 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడతలో రూ. 6 వేల కోట్లతో మరో 3 లక్షల మందికి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
5. చేపల పంపిణీ
ఉచిత చేపల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 395 కోట్లు ఖర్చు చేసి 473 కోట్ల చేపలు, రొయ్యలను నీటి వనరుల్లో విడుదల చేసింది.
6. సాగునీటి ప్రాజెక్టులు
కాళేశ్వరం నిర్మాణంతో పాటు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లను వెచ్చించింది.
7. ఉచిత విద్యుత్
రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇందుకోసం ప్రతి యేటా రూ. 11 వేల కోట్లను రైతుల తరుపున విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నది. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 36 వేల కోట్లు ఖర్చు చేసింది.
8. రుణ మాఫీ
రుణమాఫీ కింద తొలి విడత ప్రభుత్వంలో 2018 వరకు 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. లక్ష లోపు గల రూ. 16,144 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక రెండోసారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 5.42 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 50 వేల లోపు రుణాలకు సంబంధించి రూ. 1207 కోట్లను మాఫీ చేసింది.
9. ఇన్పుట్ సబ్సిడీ
దెబ్బతిన్న పంటలకు సంబంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 37.62 లక్షల మంది రైతులకు రూ.1325 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించింది.
10. నకిలీ విత్తనాల సరఫరాపై పీడీ యాక్ట్
నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై దేశంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇప్పటి వరకు 25 నకిలీ కంపెనీల యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేసింది. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న 1027 మందిని జైలుకు పంపించింది.
11. పాలకు రూ. 4 ప్రోత్సాహకం
పాడి రైతులకు సాధారణ ధర కాకుండా అదనంగా ప్రతి లీటరుపై రూ.4 ప్రోత్సాహకంగా అందిస్తున్నది. దీని కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.361.45 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా సుమారు 3 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరింది.
12. గొర్రెల్లో నట్టల నివారణ
ఈ కార్యక్రమం ద్వారా గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును పంపిణీ చేస్తున్నది. ఇందుకోసం ప్రతియేటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు 2 లక్షల మంది గొర్రెల కాపరులకు లబ్ధి జరుగుతున్నది.
13. నీటి తీరువా పన్ను రద్దు
చెరువుల నుంచి వ్యవసాయానికి నీటిని వాడుకునే రైతులకు నీటి తీరువా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాకుండా 2018 వరకు ఉన్న రూ. 800 కోట్ల బకాయిలను కూడా మాఫీ చేసింది.
14. రైతు వేదికలు
రైతులు పంటల సాగుకు సంబంధించి చర్చించుకునేందుకు గానూ ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్గా గుర్తించి ప్రతి క్లస్టర్కు రైతువేదికలను నిర్మించింది. ఈ విధంగా రూ.572.22 కోట్లతో 2601 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. దీంతో పాటు దేశంలోనే తొలిసారిగా ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది.
15. సంచార పశు వైద్యశాలలు
దేశంలో తొలిసారిగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అంబులెన్స్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నది. ఇందుకోసం ప్రతియేటా రూ. 40 కోట్లు వెచ్చిస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేయగా 30 లక్షల పశువులకు వైద్యం అందించింది.
16. ట్రాక్టర్లపై పన్ను రద్దు
వ్యవసాయ ట్రాక్టర్లపై పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు రూ. 550 కోట్ల బకాయిలను కూడా రద్దు చేసింది.
17. డ్రిప్ పథకం
రూ. 2 వేల కోట్లతో 3.50 లక్షల ఎకరాలకు రైతులకు సబ్సిడీ డ్రిప్ సిస్టం అందజేసింది.
18. కల్లాల నిర్మాణం
రైతులు పంటలను ఆరబెట్టుకునేందుకు గానూ రూ.750 కోట్ల అంచనాతో 89 వేల కల్లాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
19. సకాలంలో విత్తనాలు, ఎరువులు
తెలంగాణ ఏర్పాటుకు ముందు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పడిన గోస అంతా ఇంతా కాదు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి రోజుల తరబడి వేచి చూసిన సందర్భాలు అనేకం. కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సీజన్కు ముందుగానే అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది.
20. మిషన్ కాకతీయ
చెరువులను పునరుద్ధరించేందుకు గానూ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా సుమారు 46 వేల చెరువుల్లో పూడిక తొలగించి, తూములు నిర్మించి, చెరువు కట్టలను పటిష్టం చేసి కాలువలను పునరుద్ధరించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా చెరువుల పూడికతీతతో సుమారు 15 లక్షల ఆయకట్టును స్థిరీకరించింది.
21. సమీకృత మార్కెట్లు
రైతులు తాము పండించిన కూరగాయలు, పూలు, పండ్లతో పాటు చేపలు ఇతర ఆహార పదార్థాలను నేరు గా వినియోగదారులకు విక్రయించేందుకు, అన్ని రకాల ఆహార పదార్థాలు ఒకే చోట తక్కువ ధరకు లభించేలా ప్రభుత్వం సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేసింది.
22. రైతుబంధు సమితులు
రైతులను సంఘటితం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా రైతులే సభ్యులుగా రైతుబంధు సమితులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 10,769 గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఒక శాఖ ఏర్పాటైంది. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను రైతుబంధు సమితుల ద్వారా చర్చించి రైతులే పరిష్కరించుకుంటున్నారు.
23. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ
మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పునరుద్ధరించారు. తద్వారా రైతులకు అవసరమైన యూరియా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
24. గోదాముల సామర్థ్యం పెంపు
రాష్ట్రంలో పంటల ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం గోదాముల సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 8 లక్షల టన్నుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ఇది 63 లక్షల టన్నులకు పెరిగింది.
25. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు
మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఓసీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
26. భూ రికార్డుల సమగ్ర సర్వే
భూములపై వివాదాలు లేకుండా ఎవరి భూమిపై వారికి హక్కు కల్పించేందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ను చేపట్టి యాజమాన్య సమస్యలను పరిష్కరించింది.