హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ విడుదలచేశారు. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కోసం జీవో-244 జారీచేశారు. సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు-1996కు సవరణ చేస్తూ జీవో-243 విడుదలచేశారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించనివారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జీవోలు జారీచేయటంపై ఓసీ జేఏసీ హర్షం వ్యక్తంచేసింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు ఓసీ జేఏసీ నేతలు పోలాడి రామారావు, గోపు జయపాల్రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, పెండ్యాల కేశవరెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్లోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్ని ప్రవేశ పరీక్షల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు కృషిచేస్తామని తెలిపారు.