హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పనిప్రదేశాల నుంచి 1.14 కోట్ల మంది వలస కూలీలు సొంత గ్రామాలకు తిరిగి వెళ్లగా.. సెకండ్ వేవ్లో కేవలం 5.15 లక్షల కూలీలే తిరిగి వెళ్లారని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో పనిప్రదేశాల నుంచి తిరిగివెళ్లిపోయిన వలస కూలీల వివరాలు తెలియజేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం అడగడంతో కార్మిక శాఖ ఆదివారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఫస్ట్ వేవ్కు, సెకండ్ వేవ్కు చాలా తేడా ఉన్నదని, ఈ రెండింటినీ పోల్చి చూడొద్దని పేర్కొంది. సెకండ్ వేవ్లో చేపట్టాల్సిన చర్యలపై రాష్ర్టాలకు నిర్ణయాధికారం ఇవ్వడం.. లాక్డౌన్లు, కర్ఫ్యూలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవ్వడం ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
టాప్లో యూపీ, బీహార్
ఫస్ట్ వేవ్ సమయంలో స్వగ్రామాలకు తిరిగి వెళ్లిన కూలీల సంఖ్య ఉత్తర భారత దేశంలోనే ఎక్కుగా ఉన్నది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచే అత్యధిక వలస కూలీలు సొంత రాష్ర్టాలకు తిరిగి వెళ్లారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి తిరిగి వెళ్లిన వలస కూలీల సంఖ్య తక్కువగా ఉన్నది. ప్రత్యేకించి తెలంగాణ, ఏపీలో ఈ సంఖ్యలు తక్కువగా ఉండటం గమనార్హం.