Heavy Rains | హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్-భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భదాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
కాగా, హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమవ్వగా.. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం పడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అక్కడక్కడ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అనేక చోట్ల, హైదరాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పారు.
రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో 20 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 723.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ప్రవేశం కొద్దిగా ఆలస్యమై జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదవ్వగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టులో వర్షాలు ముఖం చాటేయడంతో కరువు తప్పదనుకున్న సమయంలో రుతుపవనాలు పుంజుకోవడంతో సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ వర్షాలు పుంజుకున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 5 వ తేదీ వరకు 5.4 మి.మీ సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. మంగళవారం నాటికి 31.8 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఈ సీజన్లో నమోదైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరతితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ నుంచి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, అది వాయవ్య ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించిందని తెలిపారు. ఇది నైరుతి దిశగా ప్రయాణించడంతో రానున్న 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారి తెలిపారు.