హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న గురువారం (నవంబర్ 30న) రోజున దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.
కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెం.మీ.లు, నిజామాబాద్ నార్త్లో 4.35 సెం.మీ.లు, నిజామాబాద్లో 3.93 సెం.మీ.లు, నిజాంపేటలో 3.58 సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్పల్లిలలో 3.45 సెం.మీ.లు, చిన్నమావంధిలో 3.15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.