జయశంకర్ భూపాలపల్లి, జూన్ 5 ( నమ స్తే తెలంగాణ)/చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మట్టి మాఫియా పెచ్చు మీరుతున్నది. టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల మీదుగా ఏర్పాటుచేస్తున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు వేలాది టన్నుల మొరాన్ని నవాబ్పేట, గిద్దెముత్తారం గుట్టల నుంచి రేయింబవళ్లు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడని దుస్థితి. దీంతో అసలేం జరుగుతున్నది? మైనింగ్ శాఖ అనుమతులున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, ఇతరులు ఆ శాఖ అధికారులకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయని పరిస్థితి. దీంతో మైనింగ్శాఖ అధికారుల కనుసన్నల్లోనే మొరం తరలింపు జరుగుతుందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్కు మొరం తరలింపు ఆపాలని నోటీసులిచ్చారు. అయినప్పటికీ మొరం తరలింపు ఆగలేదని స్థానికులు చెప్తున్నారు.
చిట్యాలం మండలం నవాబుపేట రెవెన్యూ పరిధిలోని శాంతినగర్ సమీప గుట్టలు, గిద్దెముత్తారం సమీప రాఘవాపూర్ గుట్టల నుంచి అక్రమంగా మొరం దందా రూ.లక్షల్లో కొనసాగుతున్నది. గుట్టల చుట్టూ సుమారు 30 ఎకరాల నుంచి అక్రమార్కులు మొరాన్ని తరలిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం కాంట్రాక్టర్ నామమాత్రంగా గనులశాఖ అనుమతులు తీసుకుని పరిధి దాటి మొరాన్ని తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదునుగా ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అవసరాల పేరుతో ఒక్కో ట్రాక్టర్ మొరాన్ని రూ.1,000 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. దందా వెనుక ఇద్దరు అధికార పార్టీ నేతలున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. శాంతినగర్ గుట్టలకు పట్టాలు సృష్టించి సుమారు 80 ఎకరాలకు పాస్బుక్స్ పొందారు. ఇందులో కొంతమంది పంటలు వేస్తుండగా, పంటలు వేయని భూముల నుంచి మొరం రవాణా జరుగుతున్నది. రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలనే సోయి మరిచి పట్టపగలే పోలీస్ స్టేషన్ ముందు నుంచే దందా కొనసాగడం గమనార్హం.
మొరం అక్రమ దందాపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుట్టల నుంచి హైవేకు కొంతవరకు మొరం తరలింపునకు అనుమతినిచ్చిన అధికారులు.. అనుమతికి మించి మొరం తరలిస్తున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లెక్కా పత్రం లేకుండా లక్షలాది రూపాయల మొరం దందాతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టి భూపాలపల్లి, పరకాల, హనుమకొండకు సైతం తరలివెళ్తుందని, ఇందులో అధికారుల వాటా ఎంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నవాబ్పేట గుట్టల నుంచి నేషనల్ హైవేకు మొరం తరలివెళ్తున్నది. నవాబుపేట, రాఘవాపూర్ గుట్టల నుంచి మొరం తరలింపునకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. మొరం అక్రమంగా తరలిస్తున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మొరం తరలింపును ఆపాలని కాంట్రాక్టర్కు నోటీసులిచ్చాం. మొరం తరలింపునకు అనుమతి తీసుకున్నారా? ఎన్ని టన్నులకు తీసుకున్నారు? ఇప్పటి వరకు ఎంత తరలించారనే విషయమై రిపోర్టు ఇవ్వాలని కోరాం. -వసంతరావు, తహసీల్దార్, చిట్యాల