శేరిలింగంపల్లి, మార్చి 21 : తమకు కేటాయించిన భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ చొరబాట్లు, రహదారుల నిర్మాణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. వందలాది మంది ఉద్యోగులు శనివారం గోపన్పల్లికి తరలివచ్చి ఆందోళన ఉధృతం చేశారు. బీటీఎన్జీవోలకు చెందిన భూముల్లోంచి కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా రహదారి నిర్మిస్తున్నారనే విషయం తెలుసుకొని బీటీఎన్జీవో ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో కార్యాలయం ఆవరణలో 249వ రోజు కొనసాగిన న్యాయపోరాట దీక్షా శిబిరం వద్దకు చేరుకుని ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నినదించారు. ఓ వైపు కోర్డులో వివాదం నడుస్తుండగా మరోవైపు 8 నెలలుగా ఆందోళన చేస్తున్న తరుణంలో అవేమీ తమకు పట్టనట్టు తమకు కేటాయించిన ప్రభుత్వ భూములను కొందరు అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. గోపన్పల్లి భూములను ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, పరిస్ధితి ఇలాగే కొనసాగితే ఉద్యోగులు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమని అల్టిమేటం ఇచ్చారు.
ఆక్రమణలకు అడ్డుగా కందకం తవ్విన ఉద్యోగులు
బీటీఎన్జీవోలకు చెందిన భూముల సమీపంలో శుక్రవారం ఓ క్రషర్ నిర్వాహకులు, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి అక్రమంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలుసుకొని బీటీఎన్జీవో కార్యాలయ దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా బయల్దేరి పరిశీలించారు. ప్రభుత్వానికి, ఆక్రమణదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. దాదాపు 100 అడుగుల రహదారి నిర్మాణానికి భారీ పొక్లెయినర్లు, జేసీబీలతో సదరు భూముల్లో నుంచి రహదారిని నిర్మించేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై భారీ కందకం తవ్వారు. అక్రమంగా చేపడుతున్న నిర్మాణ పనులు, అక్రమ మట్టిని తొలగించారు. టిప్పర్లు, జేసీబీలు తమ స్థలాల్లోకి రాకుండా అడ్డుకట్ట వేశారు. విషయం పెద్దదై ‘నమస్తే తెలంగాణ’లో కథనాలు రావడంతో ఆక్రమణదారులు తమ జేసీబీలు, హిటాచీలతో జారుకున్నారు. కార్యక్రమంలో బీటీఎన్జీవోస్ సెక్రటరీ మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్రావు, ట్రెజరర్ శ్రీనివాస్, డైరెక్టర్లు సంధ్యారాణి, అమరజ్యోతి, దామోదర్, కేశియానాయక్, శ్రీధర్రెడ్డి, ఏకనాథ్గౌడ్, వెంకటేశ్వర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్ : సత్యనారాయణగౌడ్
ఈ ఘటన బాధాకరమని భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీ (గచ్చిబౌలి) అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. గతంలోనే తమకు కేటాయించిన భూముల్లో 17 ఎకరాలు అన్యాక్రాంతమైన తరుణంలో అప్పటి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు తప్పని హైకోర్టు దానిపై స్టే ఇచ్చిందని చెప్పారు. ఇదిలా ఉండగా, తాజాగా అక్రమంగా తమ స్థలాల్లోంచి భారీ రహదారి నిర్మాణ పనులు చేపట్టడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ఈ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నదని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. శాంతియుతంగా న్యాయ పోరాటం చేస్తున్న ఉద్యోగులు ఏం చేస్తారనుకోవడం పొరపాటు అని, ప్రైవేట్ వ్యక్తులు తమ జోలికివస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.