హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర జలాశయం కింద ఉన్న కాలువలకు ఏపీ సర్కారు అక్రమంగా కృష్ణా నదీ జలాలను తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఏపీ పంపిన ప్రతిపాదనలను వెంటనే అడ్డుకోవాలని తుంగభద్ర బోర్డుకు ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. కృష్ణా ట్రిబ్యునళ్ల కేటాయింపుల ప్రకారం.. సుంకేశుల జలాశయం నుంచి కేసీ కెనాల్, తుంగభద్ర హై-లెవల్ కెనాల్, లో-లెవల్ కెనాల్కు తుంగభద్ర నీటిని తరలించాల్సి ఉంటుంది.
కానీ, కేసీ కెనాల్కు జరిపిన కేటాయింపుల నుంచి ఇప్పటికే 2 టీఎంసీలను హై-లెవల్ కెనాల్కు మళ్లిస్తున్న ఏపీ.. తాజాగా లో-లెవల్ కెనాల్ కేటాయింపుల నుంచి 2 టీఎంసీలను హై-లెవల్ కెనాల్ కింద వినియోగించుకునేందుకు అనుమతించాలని బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. తద్వారా శ్రీశైలం నుంచి నేరుగా కేసీ కెనాల్కు కృష్ణా జలాలను తరలించాలని చూస్తున్నది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఏపీ కుయుక్తులను అడ్డుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శిని కోరింది.