హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ అనే వ్యక్తివద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం పేస్ట్ లభించింది. దీంతో దానిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 46.51 లక్షల ఉంటుందని చెప్పారు.
బంగారాన్ని కరిగించి పేస్ట్గా మార్చి టీ షర్ట్ వెనుక భాగానికి పూసుకుని తరలించడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బంగారాన్ని ఎక్కడి తీసుకెళ్తున్నాడనే విషయంపై ఆరాతీస్తున్నారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.