హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూ ములను సొంత జాగాల్లా అమాయకులకు అం టగట్టి లక్షలు దండుకుంటున్న అక్రమార్కులకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం గుణపాఠం చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన సర్కారు స్థలాలను అప్పనంగా ఆక్రమిస్తే చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడలోని సర్వేనెంబరు 46లో వెలసిన భారీ అక్రమ నిర్మాణాల బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురాగా.. గురువా రం అధికారులు పెద్ద ఎత్తున కూల్చివేశారు. దా దాపు రెండెకరాల పరిధిలో వెలసిన వీటిని తొలగించడంతో పదెకరాల విస్తీర్ణంలోని సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించినట్టయ్యింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ బాలాపూర్ మండలం కుర్మల్గూడ గ్రామ పరిధిలోని 46 సర్వే నంబర్లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో దాదాపు పదెకరాల వరకు ఖాళీగా ఉన్నది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు పాత గ్రామపంచాయతీ అనుమతిపత్రాలు సృష్టించి.. అమాయకులకు వంద గ జాలకు రూ.15-20 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. ఆదిలోనే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తొలుత ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ.. సామాన్యుడిపై బండ’ శీర్షికన ప్రభుత్వ భూములు ఫలహారమవుతున్న వైనాన్ని బయటపెట్టింది. దీనిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ సీరియస్గా తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సహకారం కోరడంతో పోలీసుశాఖ కూడా వెంటనే స్పందించింది. బుధవారం డీసీపీ సునీతారెడ్డి స్వయం గా వెళ్లి అక్రమ నిర్మాణాలు, సదరు భూములను పరిశీలించి.. కూల్చివేతలను ఎలా చేపట్టాలనే దానిపై ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున 4 గంటలకే ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాసరావు, బడంగ్పేట కమిషనర్, బాలాపూర్ తాసిల్దార్, నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, మూడు ప్లాటూన్లతో కూడిన 85 మంది పోలీసు బలగాలు, 40 మంది మున్సిపల్ సిబ్బంది, సుమారు 15 మంది రెవెన్యూ సిబ్బంది కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు.
నాలుగున్నర గంటలకు ఆ పరిధిలోకి ఎవరూ రాకుండా చు ట్టూ ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి.. 4 జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మానవతా దృక్పథంతో నిరుపేద లు, చిన్న పిల్లలతో ఉన్న రెండు ఇండ్లను కూల్చివేయకుండా వదిలివేశారు. అక్రమార్కులు ఏకంగా 500, వెయ్యి గజాల చుట్టూ నిర్మించిన ప్రహరీలు, బేస్మెంట్లను కూడా నేలమట్టం చేశారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ కూల్చివేతల ప్రక్రియతో అక్రమార్కులు హడలెత్తిపోయారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు ఇలా ఉంటాయనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చామని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కబ్జాల తొలగింపుపై అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. పది ఎకరాలకుపైగా ఉన్న ఈ భూమిని ప్రజా ప్రయోజనాలకోసం ఎలా వినియోగించాలనేది కలెక్టర్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో సూరజ్కుమార్ తెలిపారు.