కంది, ఆగస్టు 7: అంతర్జాతీయంగా అన్ని రం గాల్లో పరిశోధనలకు సంబంధించి పీహెచ్డీ స్థాయి లో జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్(జేడీపీ)పై ఐఐటీ హైదరాబాద్, ఖాట్మాండు యూనివర్సిటీ (కేయూ) సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. జేడీపీ కింద భారతదేశం, నేపాల్ నుంచి ఎంపికైన విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, డిజైన్, మెడికల్ ఇన్నోవేషన్స్ సరిహద్దు ప్రాంతాల్లో పని చేసే అవకాశం ఉంటుంది. జేడీపీలలో చేరిన విద్యార్థులు ఐఐటీహెచ్లో ఒక సంవత్సరం వరకు విద్యనభ్యసించడంతో పాటు స్కాలర్షిప్ కూడా పొందుతారు. కేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బోలా థాపా మాట్లాడుతూ.. అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, అంతర్జాతీయ ఇంటర్న్షిప్లను ప్రోత్సహించేందుకు కేయూ, ఐఐటీహెచ్ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. కేయూతో జేడీపీ అవగాహన ఒప్పందం నేపాల్ అభివృద్ధికి దోహదపడటంతో పాటు విద్యార్థులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.