సంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జపాన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించేందుకు ఐఐటీ హైదరాబాద్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఐఐటీ హైదరాబాద్, జైకా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో జైకా ప్రతినిధి సైతో మిత్సునోరి, జపాన్ నేషనల్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, హెల్త్కేర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఓనోతైచి పాల్గొన్నారు.
జైకా ప్రతినిధి సైతో మిత్సునోరి మాట్లాడుతూ.. భారత్లో మొట్టమొదటి జపనీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించినట్టు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ అభివృద్ధి కోసం జైకా రూ.1,400 కోట్ల రుణ సహాయం అందజేసినట్టు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ లాంటి ఉన్నత సాంకేతిక విద్యా సంస్థలో భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసేందుకు జపనీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.