కంది, డిసెంబర్ 10: కొవిడ్ నియంత్రణకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 40 ఏండ్లు దాటిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఈ మధ్య ఒమిక్రాన్ ప్రతి ఒక్కరిని భయపెడుతున్నది. రెండు డోసులు వేసుకున్నా, టెస్టుకు సంబంధించిన సరైన పత్రాలను చూపితేకానీ కొన్ని దేశాలు అనుమతించడం లేదు. అయితే గతంలో కొవిడ్-19కి సంబంధించిన ట్రాకింగ్ ఆన్లైన్ సమాచారం కోసం కొన్ని వెబ్సైట్లు వచ్చినా, అవి అంతగా పని చేయలేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సభ్యులు కొత్తగా covid19tracker.in వెబ్సైట్కు రూపకల్పన చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు సంబంధించిన పూర్తిస్థాయి కొవిడ్ సమాచారాన్ని పొందుపర్చారు. అంకెలే కాకుండా గ్రాఫ్తో కూడిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వెబ్సైట్ను శుక్రవారం ఉదయం వర్చువల్ కాలింగ్ ద్వారా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సైట్ రూపకల్పనకు కృషి చేసిన ప్రొఫెసర్లు ఎం విద్యాసాగర్, భీమార్జున్రెడ్డితోపాటు వారి బృంద సభ్యులను మూర్తి అభినందించారు.
ఈ సైట్లోని సమాచారం పది భాషల్లో అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంతమంది ఇప్పటివరకు కొవిడ్ బారినపడ్డారు? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది కోలుకున్నారు? ఎంతమంది టీకా వేసుకున్నారు? అనే సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘సూత్ర మోడల్’ పేరుతో ఉన్న లింక్ను నొక్కితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు సంబంధించిన కేసుల వివరాలు తెలుసుకోవచ్చు. గంట గంటకూ తాజా సమాచారాన్ని అప్డేట్ చేయడం దీని ప్రత్యేకత. ఈ వెబ్సైట్ లెక్కల ఆధారంగా.. దేశంలో ఇప్పటివరకు రెండు డోసులు వేసుకున్న వారి సంఖ్య 49.90 కోట్లు కాగా, యాక్టివ్ కేసులు దేశంలో ఇప్పటివరకు 94,756 మంది ఉండగా, 4,74,396 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 2.88 కోట్ల మందికి టెస్టులు చేశారు. ఇందులో 6,77,747 పాజిటివ్గా ధ్రువీకరించగా, 6,69,678 మంది కోలుకోగా, 4,004 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 4,065 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు.