హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తిరుమలలోని ఘాట్రోడ్ పటిష్టంగానే ఉన్నదని ఐఐటీ ఢిల్లీ నిపుణుడు కేఎస్ రావు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో రోడ్డు నిర్మాణం చేయాలని సూచిస్తామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఘాట్రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో తిరుమల ఘాట్లో గురువారం ఢిల్లీ ఐఐటీ బృందం పర్యటించి, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం బృందం మీడియాతో మాట్లాడుతూ 12 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపింది. కొండచరియలు విరిగి పడకుండా త్వరలో శాశ్వతచర్యలు తీసుకోవాలని టీటీడీకి సూచించింది. ఊహించని విధంగా వర్షం కురువడంతో 40 నుంచి 50 టన్నుల బరువు గల కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపింది. అయినప్పటికీ ఘాట్రోడ్ పటిష్టంగానే ఉందని, రాక్ఫాల్స్ కారణంగానే రోడ్డు దెబ్బతిన్నదని పేర్కొన్నది.