హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నీటి శుద్ధికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఆధునిక విధానాన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న మెంబ్రేన్ టెక్నాలజీని ఆధునీకరించి తక్కువ రసాయనాలు, నీటి వృథాను నియంత్రించేలా నానో ఫిల్టరైజేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చెరువులు, కుంటల నీటితోపాటు భూగర్భం నుంచి సేకరించే నీటి శుద్ధి ప్రక్రియ పర్యావరణహితంగా సాగుతుందని ఐఐసీటీ వర్గాలు తెలిపాయి.
ఈ విధానంలో నిర్వహణ భారం తగ్గడంతోపాటు నీటిని వేగంగా, సమర్థంగా ఫ్యూరిఫై చేసే వీలుంటుందని పేర్కొన్నాయి. సాధారణ మెంబ్రేన్ ఫిల్టరైజేషన్ ప్రక్రియలో సగానికి కంటే ఎక్కువ నీరు వృథా అవుతుంది. ఆ నీటిని మళ్లీ వాడుకోవడానికి వీలు ఉండదు. కానీ, ఐఐసీటీ కొత్త విధానంలో వృథా నీటిలో 80 శాతం పునర్వినియోగానికి వీలుంటుంది. ఆ నీటిని దుస్తులు ఉతకడానికి, ఇతర గృహ, వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు. నీటిలో మినరల్ పరిమాణం కూడా 60 పీపీఎం నుంచి 120 పీపీఎంకు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
మినరల్స్ పుష్కలం
నానో ఫిల్టరైజేషన్ నీటిలో మినరల్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ప్రధానమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్తోపాటు మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు నీటిలో వృద్ధి చెందేలా డెవలప్ చేశారు. పర్యావరణహితంగా జరిగే నీటిశుద్ధి ప్రక్రియతో టీడీఎస్, నీటి లవణీయత, భార లోహాలు, సూక్ష్మ జీవులను కూడా సమర్థంగా వడపోస్తుంది. మెంబ్రేన్ వాటర్ ఫిల్టర్ వ్యవస్థకు ఐఐసీటీ డెవలప్చేసిన పరికరాలను అదనంగా అమర్చుకొని పరిశుద్ధమైన నీటిని పొందవచ్చని ఐఐసీటీ శాస్త్రవేత్తలు తెలిపారు.