యాదాద్రి, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) గుర్తింపు లభించింది. మూలవరులను ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిలతో ప్రధానాలయ పునర్నిర్మాణం, కొండచుట్టూ పచ్చదనం, నీటిశుద్ధి నిర్వహణ, విద్యుత్తు వినియోగం, ప్రసాదాల తయారీపై 2022- 2025 సంవత్సరానికిగాను ఐజీబీసీ గ్రీన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రేటింగ్ సిస్టం కింద సర్టిఫికెట్ వరించినట్టు ఆ సంస్థ ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు. ఈ నెల 20న హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. గౌరవప్రదమైన సర్టిఫికెట్ను వైటీడీఏ అధికారులు అందుకోనున్నారు. వర్షపు నీటిన ప్రత్యేకమైన కాల్వల ద్వారా చెరువులకు మళ్లించే స్టామ్ వాటర్ డ్రైన్ పద్ధతితో పాటు అధునాతన ట్యాప్, పైపుల వినియోగం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్న విధానం బాగున్నదని ప్రవీణ్ అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా 100% ఎల్ఈడీ లైట్ల వినియోగం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.