హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఇది బడ్జెటేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ మోసం బహిర్గత మైందని ఆరోపించారు. వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్(Farmers Declaration) లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకుండా అది చిత్తు కాగితమేనని నిరూపిస్తూ కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రైతుబంధు , రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధికి నిధులేవని ప్రశ్నించారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవి నీటిమీద రాతలేనా అని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ అమలుకానట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులకు ధోఖా చేసిందని వెల్లడించారు. బీసీ సబ్ ప్లాన్(BC Sub Plan) చట్టబద్ధం చేస్తామని బీసీలను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీల బలోపేతం గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి నిధులు కేటాయించకుండా ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వాగ్దానాలన్నీ ఎలా అమలు చేస్తారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు (Irrgation Projects) కేటాయించిన నిధులు రూ. 28 వేల కోట్లు ఏమాత్రం సరిపోవని తెలిపారు. నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా కృష్ణానది మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.