హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నట్టు సంస్థ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్ బలరామ్ తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామంటూ ఇటీవల కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని, అలాంటి వాళ్ల మాటలను నమ్మొద్దని శనివారం స్పష్టంచేశారు. సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం సుమారు లక్ష మంది దరఖాస్తు చేసినట్టు శనివారం ప్రటించారు. పరీక్ష, మూల్యాంకనం అంతా కంప్యూటర్ ఆధారంగానే జరుగుతుందని, ఇంటర్వ్యూలు లేనందున మానవ ప్రమేయం లేకుండానే ఉద్యోగ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా నమ్మబలికితే వెంటనే 9491145075 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.